ఆర్మూర్, ఏప్రిల్ 25: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రతీ ఇంట్లో చర్చ జరపాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రీయ కల్యాణ మండపంలో మంగళవారం బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల మహాసభను నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణతల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ….కేసీఆర్ ఉద్యమ నేతగా చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పసుపుబోర్డు ఎగ్గొట్టి, రైతులకు పంగనామాలు పెట్టిన ఎంపీ అర్వింద్ను ఇంటికి సాగనంపాలన్నారు. బీఆర్ఎస్ ఓట్ల కోసం, సీట్ల కోసం పుట్టిన పార్టీ కాదని తెలంగాణ ప్రజల అగచాట్లను తొలగించేందుకు త్యాగాల పునాదిపై పుట్టిన రాజకీయ వారధి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో ఆర్మూర్ రూపురేఖలు మారాయన్నారు. గతంలో అంధకారంలో ఉన్న ఆర్మూర్ ప్రస్తుతం సుందరమైన అభివృద్ధి మందిరంగా మారిందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించి హ్యాట్రిక్నివ్వాలన్నారు. అంతకుముందు జిల్లా ఇన్చార్జి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణకు వచ్చిన అమిత్షా మనకు రావాల్సిన నిధులు, కాళేశ్వరం జాతీయ హోదా గురించి మాట్లాడలేదు కానీ, పేపర్ లీకేజీ గురించి మాట్లాడుతారు. మీ గుజరాత్లో పేపర్ లీక్లు లేవా అని ప్రశ్నించారు.
రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మాట్లాడుతూ జీవన్రెడ్డి సూపర్ లగ్జరీ బస్సులాంటి వాడని అందుకే ఆర్మూర్ను అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ప్రయాణింపజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, జడ్పీచైర్మన్ విఠల్రావు, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.