బాన్సువాడ, సెప్టెంబర్ 5 : గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. సమైక్య పాలనలో అష్టకష్టాలు పడి చాలీచాలనీ వేతనాలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాబోధన చేసిన కాంట్రాక్టు ఉపాధ్యాయులకు స్వరాష్ట్రంలో తీపికబురు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 లో కాంట్రాక్టు ప్రతిపాదికన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్నర్స్, లైబ్రెరియన్లు, విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు నియామకం అయ్యారు. నాటి నుంచి నిన్నటి వరకు వేతనాలను అంతంత మాత్రమే వచ్చేవి. శ్రమ దోపిడికి గురిచేసిన నాటి పాలకుల అసమర్ధ పాలనలో గురుకుల కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితులు వర్ణణాతీతం. చాలీచాలని వేతనాలతో జీవనం వెల్లదీసిన సందర్భాలు ఉండేవని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశారు. ఇప్పటికే ఒకవైపు వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు తదితర ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమైక్య పాలనలో విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు మంచి మేలు చేకూరనుంది.
సమైక్య పాలనలో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు శ్రమదోపిడికి గురయ్యారు. 2007లో కాంట్రాకు పద్ధతిన గురుకులాల్లో నియామకం అయ్యారు. వారిని రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేయించిన నాటి ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వలేదు. 2007లో సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో కాంట్రా క్టు పద్ధతిన చేరిన ఉపాధ్యాయులకు నాడు 5,700 రూపాయల వేతనం అందేది. 2009లో రూ.7,900 అందించేది. అనంతరం 2012లో జాయిన్ అయిన వారికి ఆ ఏటా 16 వేల 100 రూపాయల వేతనం వచ్చేవి. ప్రస్తుతం స్వరాష్ట్రంలో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు 42 వేల 300 వరకు వేతనం అందుతుంది. తాజాగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గురుకులాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య పాలనలో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కార్లో రెగ్యులరైజ్ కావడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు.
2007లో నేను బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయురాలిగా జాయిన్ అయ్యాను. చాలా రోజులుగా వచ్చే చిన్నపాటి వేతనం సరిపోయేదికాదు. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ను సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉంది. 16 ఏండ్ల కల సాకారం అయ్యింది. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రుణపడి ఉంటాం.
– వాసంతి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొయ్యగుట్ట (బాన్సువాడ మండలం)
ఎన్నో ఏండ్లుగా సమైక్య పాలనలో కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించిన తనకు స్వరాష్ట్రంలో మేలు చేకూరుతుంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 2009లో జాయిన్ అయ్యాను. ఆ రోజుల్లో రూ.7200లకు ఫుల్టైం పనిచేసేవాళ్లం. కానీ అప్పుడు పనికి తగ్గవేతనం అందేది కాదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో రూ.42 వేల వేతనం వస్తుంది. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, మంత్రి హరీశ్రావ్కు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం.
– సృజన, ఉపాధ్యాయురాలు
కేసీఆర్లాంటి సీఎం దేశంలో ఎక్కడ లేడు. అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారు. అప్పట్లో 16 వేల 100 రూపాయలకు పనిచేశాం. కానీ తెలంగాణ సర్కార్ హయాంలో 42 వేల రూపాయల వేతనం తీసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది.
– భాగ్యలక్ష్మి, కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు