ఖలీల్వాడి/కామారెడ్డి, మే 18: భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నిప్పులు కక్కుతున్నాడు. ఈ తరుణంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్ర‘తాపం’ చూపుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఎండవేడిమి, ఉక్కపోతతో ఉడికి పోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, రానున్న రోజుల్లో ఎండ మరింత దంచికొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టేందుకు జంకుతున్నారు.
పని మీద బయటకి వెళ్లే వారితో పాటు ఇంట్లో వారు సైతం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండవేడిమి, ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తుందని, జ్వరం, వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిత్యం 4-5 లీటర్ల నీళ్ల్లు తాగాలని, పండ్ల రసాలు, మజ్జిగ వంటివి సేవించాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా పెరగడం వలన ముఖ్యంగా శరీరంలో ప్లూయిడ్ లెవల్స్ పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తినాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు.
ఎండల తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. ముఖ్యమైన పని ఉంటేనే అడుగు బయట పెడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజంతా కూలర్లు, ఏసీలు వినియోగిస్తుండడంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు కూలర్లు, ఏసీల నుంచి పెద్దగా ఉపశమనం ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు, పని మీద బయటకు వెళ్లిన వారికి తాగునీళ్లు దొరకడం కష్టంగా మారింది. గతంలో ఎక్కడికక్కడే చలివేంద్రాలు కనిపించేవి. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసే వారు. కానీ, ఈసారి అధికారులు పట్టించుకోక పోవడంతో చలివేంద్రాల జాడ కనిపించడం లేదు. దీంతో డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు.
కొద్దిరోజులుగా ఎండ లు దంచి కొడుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటినా భానుడి ప్రతాపం తగ్గడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉక్కపోత పగలూరాత్రి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని స్పష్టం చేశారు.
ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే ఐదు రోజులు మరింత తీవ్రత పెరిగే అవకాశముంది. జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు. ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే బయటికి వెళ్లాలి. వడదెబ్బ తగిలితే వెంటనే దవాఖానలో చేర్పించాలి. ఉప్పు నీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుచ్చకాయ రసం, మజ్జిగ వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
– డా.రవీందర్గౌడ్, డీఎంహెచ్వో, కామారెడ్డి
వాతావరణ మార్పుల కారణంగా ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్తే తలకు టవల్, మాస్క్ వంటివి తప్పనిసరిగా వాడాలి. నిత్యం కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్పదించాలి.
– జలగం తిరుపతిరావు, వైస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల