బోధన్, ఫిబ్రవరి 6: నిజాం షుగర్స్ పునరుద్ధరణ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందూ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా..? నిజాం షుగర్స్ ఫునరుద్ధరణ ఇక లేనట్టేనా? అన్న అనుమానాలు నిజామాబాద్లో జరిగిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగభతో పటాపంచాలయ్యాయి. పునరుద్ధరణ ఉండదన్న రీతిలో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కార్మికులు, రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.
‘ఉన్న షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది. పామాయిల్ ఫ్యాక్టరీ మా నిజామాబాద్కు ఇవ్వాలని కోరుతున్నామని’ సుదర్శన్రెడ్డి సీఎంను కోరవడంతో నిజాం షుగర్స్ పునరుద్ధరణ ఇక జరగదన్న విషయం స్పష్టమయింది. ఆ తర్వాత మాట్లాడిన రేవంత్రెడ్డి కూడా నిజాం షుగర్స్ పునరుద్ధరణ ఊసే ఎత్తకపోవటం చూస్తుంటే.. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద షుగర్ ఫ్యాక్టరీగా పేరొందిన నిజాం షుగర్స్ ఇక కాలగర్భంలో కలిసిపోయినట్లేనన్న చర్చ మొదలైంది. నిజాం షుగర్స్ ఇక పునరుద్ధరణ జరగదన్న విషయం సుదర్శన్రెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.
వాస్తవానికి మొదటి నుంచి నిజాం షుగర్స్ పునరుద్ధ్దరణ విషయంలో కాంగ్రెస్ నాయకులు రైతులు, కార్మికులతో దోబూచులాట ఆడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ పునరుద్ధరణ అంటూ హడావుడి చేశారు.
ఇందుకోసం మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ నిజాం షుగర్స్కు చెందిన శక్కర్నగర్, మెదక్, మెట్పల్లి యూనిట్లను మొక్కుబడిగా సందర్శించింది. ఆ తర్వాత ఏమైందో ఏమోగాని మళ్లీ ఫ్యాక్టరీల వైపు తొంగిచూడలేదు. రైతులు చెరుకు పండిస్తే, బోధన్ ఫ్యాక్టరీని తెరుస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్పటం ప్రారంభించారు. అయితే, రైతులు చెరుకు పండించేలా వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ ద్వారా ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేదు. చెరుకు పండిస్తే ఇచ్చే ప్రోత్సాహకాలపై ఎటువంటి ప్రకటనలను ప్రభుత్వ పెద్దలు చేయలేదు.
రైతులు చెరుకు పండించలేదు కాబట్టి ఫ్యాక్టరీని తెరవటం లేదంటూ నెపం రైతులపై నెట్టే కుట్ర జరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే రేవంత్రెడ్డి సభలో సుదర్శన్రెడ్డి ఫ్యాక్టరీ బంద్ అయిందంటూ వ్యాఖ్యానించారని పలువురు భావిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు నిజామాబాద్లో జరిగిన బహిరంగసభలో సీఎం హోదాలో రేవంత్రెడ్డి ఆరు నెలల్లో నిజాం షుగర్స్ను తెరుస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ తాజాగా మరోసారి నిజామాబాద్ పర్యటనకు వచ్చిన రేవంత్రెడ్డి పునరుద్ధరణ మాట కూడా ఎత్తకపోవడంతో చెరుకు రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వాగ్దాన భంగంపై మండిపడుతున్నారు.