నిజామాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఖజానా’లో అవినీతి రాజ్యమేలుతున్నది. ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులే పీక్కు తినే శాఖ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ఖజనా శాఖనే. వివిధ శాఖలకు చెందిన బిల్లులకు, ఉద్యోగులకు వర్తించే వివిధ ప్రయోజనాలపై టార్గెట్లు పెట్టి మరీ ట్రెజరీలో దోచుకుంటున్నారు. చేయి తడపనిదే ఇక్కడ ఏ పనీ కాదు. ఫైలు ముందుకు కదలదు. డబ్బులు ఇవ్వలేదో ఫైళ్లు తొక్కిపెట్టడం, కొర్రీలు పెట్టి నెలల తరబడి తిప్పించుకోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. వార్షిక ఆదాయ పన్నుకు సంబంధించిన క్లెయిమ్స్ కోసం కోశాధికారి కార్యాలయానికి వెళ్తే ఫైల్కు ఒక రేటు చొప్పున దోచుకుంటున్న వైనంపై టీచర్లు మండిపడుతున్నారు. తప్పనిసరై ఎస్టీవోల్లో ట్రెజరీ ఉద్యోగులు అడిగిన కాడికి చేతులు తడిపి పని చేయించుకుంటున్నారు. లేదంటే ఐటీ క్లెయిమ్స్ ఇబ్బందులు తలెత్తుతాయని, ఫిబ్రవరికి సంబంధించిన జీతాలు నిలిచిపోతాయనే భయంతో సొమ్ము ముట్టజెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్ల చాంబర్లకు సమీపంలోనే ఉండే ట్రెజరీ కార్యాలయాల్లో కొనసాగుతున్న లంచాల పర్వంపై బహిరంగంగానే చర్చ జరుగుతున్నది.
గతంలో ట్రెజరీ కార్యాలయాలు ఎక్కడో విసిరేసినట్లుగా ఉండేవి. దీంతో సిబ్బంది ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లుగా ఉండేది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మించి అన్ని శాఖలను ఒకే గూటి కిందకు చేర్చారు. ప్రైవేటు బిల్డింగ్లలో, ప్రభుత్వ ప్రాంగణాల్లోనే ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే ట్రెజరీ ఆఫీసులను సైతం తీసుకొచ్చి సమీకృత కలెక్టరేట్లోనే ఆఫీసులను కేటాయించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల చెంతనే ఖజానా శాఖకు సైతం స్థానం కల్పించడంతో అవినీతి, అక్రమాలు అదుపు చేయొచ్చని కేసీఆర్ సర్కారు భావించింది. పర్యవేక్షణ పెరగడంతో గతంలో లంచాలు అడగాలంటే ఉద్యోగులు భయపడే వారు. కానీ ఇప్పుడు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోయింది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బహిరంగంగానే దోపిడీ జరుగుతున్నదని వివిధ శాఖల ఉద్యోగులు వాపోతున్నారు. కలెక్టర్ చాంబర్కు కూత వేటు దూరంలోనే ఉండే ట్రెజరీలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు గుర్తించకపోవడం శోచనీయం. పర్యవేక్షణ లేమి మూలంగా ట్రెజరీ శాఖలో ఇష్టారాజ్యం నడుస్తున్నది. గతంలో వీఆర్ఏలకు శాఖల కేటాయింపు సమయంలోనూ ట్రెజరీలో ఇదే రకమైన వసూళ్ల పర్వం వెలుగు చూడగా, ఇప్పుడు టీచర్ల విషయంలోనూ అలాగే జరుగుతున్నది.
ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు జిల్లా ట్రెజరీ కార్యాలయం గుండె కాయ వంటిది. ఒక్క పైసా విడుదల కావాలన్నా సంబంధిత అధికారులు నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేస్తారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేసిన వ్యయాలకు బిల్లులు సమర్పిస్తే అందుకు అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేయడం పరిపాటి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కోశాధికారి కార్యాలయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం ప్రజల అవసరాలను తీరుస్తూ బాధితుల కష్టనష్టాలను తీర్చే పలు శాఖల అధికారులే.. ట్రేజరీ అధికారులకు బాధితులుగా మారుతున్నారు. బిల్లుల మంజూరులో తాత్సారం, కమీషన్ల డిమాండ్ బహిరంగంగానే నడుస్తుండటంతో అవాక్కవుతున్నారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో రావాల్సిన బిల్లులకు ట్రెజరీ ద్వారా మంజూరు చేసుకునేందుకు శాఖలన్నీ బిల్లులు సమర్పిస్తుండగా పర్సెంటేజీల దందాతో ప్రభుత్వ శాఖల అధికారులు కంగు తింటున్నారు. చిన్నపాటి లోటుపాట్లను ఆసరా చేసుకుంటున్న ట్రేజరీ సిబ్బంది బిల్లులు ఇలా సమర్పించగానే… అలా డబ్బులు డిమాండ్ చేస్తుండటం విశేషం. జీపీఎఫ్, గ్రాట్యూటీ, ఈఎల్స్, చివరకు మెడికల్ రీ-యింబర్స్మెంట్లకు సమర్పించిన బిల్లులకు సైతం పర్సంటేజీలు వసూళ్లు చేస్తుండటం గమనార్హం.
ఐటీ క్లెయిమ్స్ కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అసవరం లేదు. కచ్చితమైన బిల్లులు సమర్పించి జీతాలు పొందవచ్చు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి 29కే క్లెయిమ్స్ సమర్పణకు ఆఖరు తేదీ కావడంతో పని భారం ఎక్కువగా ఉంది. సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోనూ ఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ నెం.77999 34123కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.