పట్టణ ప్రగతి దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, భీమ్గల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆర్మూర్లో జీవన్రెడ్డి, నిజామాబాద్లో బిగాల గణేశ్ గుప్తా పాల్గొన్నారు.
భీమ్గల్, జూన్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భీమ్గల్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి వివరించారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ.. ఒక్క భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు గడిచిన తొమ్మిదేండ్లలో రూ.250 కోట్ల నిధులు ఖర్చుచేసినట్లు వెల్లడించారు.
కేవలం 15వేల జనాభా కలిగిన పట్టణంలో ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించారంటే ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమాభివృద్ధి కోసం పాటుపడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. భీమ్గల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎంతో మంది హేమాహేమీలు ప్రాతినిథ్యం వహించినప్పటికీ భీమ్గల్ పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయిందన్నారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి తెస్తూ పురపాలిక రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నదన్నారు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అందిస్తున్న నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూ రు చేస్తుండడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతున్నదన్నారు.
లేనిపక్షంలో సెంట్రల్ ఫైనాన్స్ నిధులు బల్దియాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేవన్నారు. స్వరాష్ట్రంలోనే ప్రగతి సాధ్యమైందన్నారు. భీమ్గల్ పట్టణానికి మున్సిపాలిటీ హోదా కల్పిస్తూ రూ.20కోట్ల నిధులను తమ ప్రభుత్వం మంజూరు చేయగా, ఎమ్మెల్సీ కవిత చొరవతో మరో రూ.5 కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులతో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు వంటి పనులతోపాటు ఓపెన్ జిమ్లు వంటివి ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ బంజారా భవన్, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్లు, మహిళా భవనాలు, రూ.35 కోట్లతో వంద పడకల దవాఖాన, రూ.3కోట్లతో సమీకృత మార్కెట్ యార్డు, రూ.2 కోట్లతో 6 వైకుంఠధామాలు, రూ.30లక్షలతో మూడుచోట్ల పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోనే మొట్టమొదటగా భీమ్గల్ పట్టణంలో ఇంటింటికీ తాగునీరు అందించామని మంత్రి గుర్తుచేశారు. రూ. 10కోట్లతో కప్పల వాగుపై రెండు చెక్డ్యామ్లను నిర్మించడంతో భూగర్భజలాలు వృద్ధి చెంది నీటి కొరత అధిగమించామన్నారు.
పాత అంగడిబజార్లోని పోలీస్స్టేషన్ స్థలంలో అర్బన్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానున్నదని, సుమారు 228 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నెల రోజుల్లోపు అర్హులైన కుటుంబాలకు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. భీమ్గల్ పట్టణంలో ఆసరా పెన్షన్ల కింద ఇప్పటి వరకు రూ.40.35 కోట్లు పంపిణీ చేశామని, రైతుబంధుకు రూ.12కోట్లు, రైతుబీమాకు రూ.కోటీ20లక్షలు, గొర్రెల పంపిణీకి రూ.40.25 లక్షల మేరకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. 353 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.కోటీ 68 లక్షలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 677 మందికి రూ.6.56 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణ శుభ్రతకు విశేషంగా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులనుద్దేంచి ‘సఫాయి అన్న నీకు సలాం… సఫాయి అమ్మా నీకు సలాం ’అంటూ మంత్రి సభాముఖంగా వందనాలు తెలియజేశారు. ఉత్తమ సేవలందించిన మున్సిపల్ సిబ్బందిని సన్మానించి మహిళలకు చీరెలను పంపి ణీ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, వైస్ చైర్మన్ భగత్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయీజ్, ఎఫ్ఏసీ చైర్మన్ నర్స య్య, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్దార్ శ్రీధర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్స య్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, రైతుబంధుసమితి మండల కన్వీనర్ శర్మ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.