నిజామాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై ఆదివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగిందని తెలిపారు. సీఎంతో ఉన్నత స్థాయి సమావేశం జరిగిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సచివాలయంలోని తన చాంబర్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇరిగేషన్ శాఖ సీఈలతో సమావేశం నిర్వహించారు. చుక్కా వర్షపు నీరు ఎస్సారెస్పీకి రాకున్నా కాళేశ్వరం జలాలతో సాగు నీరు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉభయ జిల్లాల్లో వానాకాలం పంటకు సాగు నీరు అందించే అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి వేముల చర్చించారు.
పునరుజ్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపుతామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎల్ఎండీ ఎగువ భాగం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 50 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా ఉండగా ఎస్సీరెస్పీలో ప్రస్తుత 20 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నదని తెలిపారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఎస్సారెస్పీ పునరుజ్జీవంలో భాగంగా కాళేశ్వరం జలాలను రోజుకు 0.5టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు లిఫ్ట్ చేసి ఎస్సారెస్పీలో నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి వివరించారు. నీటిని లిఫ్ట్ చేయడానికి సంబంధించిన మూడు పంప్ హౌస్లను సిద్ధం చేయాలని సీఈ సుధాకర్రెడ్డిని మంత్రి ఆదేశించారు. నిజామాబాద్ జి ల్లాలోని ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించడానికి గుత్ప, అలీసాగర్, లక్ష్మీ కెనాల్, చౌట్పల్లి హన్మంత్ రెడ్డి తదితర లిఫ్ట్లకు, కాకతీయ కెనాల్ ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ ఇరిగేషన్ శాఖ సీఈ మధుసూదన్ రావుకు ఆదేశాలు జారీ చేశా రు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5టీఎంసీలు నీటి నిల్వ ఉండగా.. వానాకాలం సాగు కోసం రైతులకు నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో తక్షణం ఏర్పాట్లు చేయాలని కామారెడ్డి జిల్లా సీఈ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి వేముల ఆదేశించారు.