బాన్సువాడ రూరల్, జూలై 10 : సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జీపీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వానకాలం ఆరంభమై నెలరోజులకుపైగా అవుతున్నా ఆశించినస్థాయిలో వర్షాలు కురవలేదన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నామని అన్నారు.
వర్షాలు కురవని తరుణంలో కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి పంటలను కాపాడుతామని భరోసా ఇచ్చారు. నీటి విడుదలకు ఇప్పటికే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, డబుల్బెడ్రూం ఇండ్ల పథకం, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తూ తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. సమాజంలో ఉనికి లేని కొందరు నాయకులు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పని చేస్తున్న ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని కోరారు.
సమీకృత భవన నిర్మాణ పనుల పరిశీలన
నస్రుల్లాబాద్, జూలై 10: మండల కేంద్రంలో రూ.కోటితో చేపట్టిన మండల సమీకృత భవన నిర్మాణ పనులను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టి, వచ్చే నెల 14వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూ చించారు. అనంతరం గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి సాయంకాలం ప్రార్థనలో పాల్గొన్నారు. పాఠశాలలో అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.