తెలంగాణ కథలను విశ్వవ్యాప్తం చేసిన రచయితల్లో డా. టి. సంపత్ కుమార్ ఒకరు. తొలి కథా సంపుటి ‘లియోసా’తోనే.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పల్లె నుంచి ఢిల్లీ వరకూ సాగిన తన జీవితానుభవాలకు సమాజంలోని విభిన్న అంశాలను జోడించి కథలు రాస్తుంటారు ఆయన. ఓవైపు పర్యావరణ పరిరక్షణ, సామాజిక స్పృహ, మానవ సంబంధాలకు పెద్దపీట వేస్తూనే.. ఇంకోవైపు సున్నితమైన ప్రణయాన్ని కూడా తన రచనల్లో జొప్పిస్తుంటారు. లియోసా తర్వాత పెన్నులు, ‘నా’ నుంచి ‘మన’ వరకు కథా సంపుటాలు వెలువరించగా.. ‘అందమైన నరకం’ ఆయన నాలుగో పుస్తకం. ఇందులో మొత్తం ఎనిమిది కథలు ఉన్నాయి. కొన్ని కథలు వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన పోటీల్లో బహుమతులు గెలుచుకోగా.. మరికొన్ని ప్రచురణకు ఎంపికయ్యాయి.
కవర్ పేజీగా వచ్చిన కథ.. అందమైన నరకం. సాధారణంగా మొదలైనా.. దీని ముగింపు మాత్రం అసాధారణం. అందమే శాపమై.. యాసిడ్ దాడికి గురైన యువతి గాథ ఇది. సమాజం ఎంత ఆధునికతను సంతరించుకుంటున్నా.. ఇప్పటికీ కొందరు కోడళ్లు, విధవరాలైన అత్తకు ‘చాటుగదులు’ ఏర్పాటు చేస్తున్నారు. అలా, చాటుగదికే పరిమితమైన ఓ అత్తకు విముక్తి కలిగించడానికి చేసిన ప్రయత్నమే.. ‘ఫుట్బాల్’ కథ. ఈ పుస్తకంలోని మరో ఆసక్తికరమైన కథ.. చిత్తరువుల చిత్రాలు అలియాస్ ఫొటోల తూటాలు అలియాస్ స్టేటస్ కాక్టస్. సమాజానికి దూరంగా.. సామాజిక మాధ్యమాల ‘భ్రమ’లో బతుకుతున్న నేటితరం జీవితాలను ఆవిష్కరిస్తుంది.
‘నేను కథని’.. కథ ప్రయోగాత్మకంగా సాగుతుంది. భవిష్యత్తులో కథలు ఎలా రాయబోతున్నారో ఊహించి చెబుతుంది. బతుకు దెరువు కోసం తండ్రులు ఎడారి దేశాల బాట పడితే.. ఇక్కడ వారి పిల్లల పెంపకం, చదువులు అగమ్యగోచరంగా తయారవుతున్నాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపిన కథ.. ‘దేశం బోయిండ్రు’. భారత సైన్యంలో చేరి, దేశ రక్షణలో పాలుపంచుకోవాలని కలగనే ఓ యువకుడు. అనూహ్యంగా ‘రష్యా-ఉక్రెయిన్’ యుద్ధరంగంలో తేలుతాడు. అందుకు దారితీసిన పరిస్థితులు తెలుసుకోవాలంటే.. ‘సైనికుడు కాని సైనికుడు’ చదవాల్సిందే! ‘మటన్’.. అచ్చమైన తెలంగాణ మాండలికంలో సాగితే; ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొరకు అండగా నిలవాలని చెబుతుందీ ‘సహాయ హస్తాలు’ కథ. ఇందులోని ఒక్కో కథ.. సమాజంలోని ఒక్కో సమస్యను కళ్లకు కడుతుంది. దానికి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తుంది.
రచన : డా॥టి.సంపత్ కుమార్
పేజీలు : 132; ధర : రూ.200
ప్రచురణ: మాధవీలత ప్రచురణలు, నిర్మల్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98104 02895
-శ్రీనివాస్ చిల్ల