వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లోకెక్కుతున్న తెలంగాణ యూనివర్సిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా తీసుకుంటున్న హడావుడి నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది. గతంలో డబ్బులు తీసుకుని అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టిన నియామక ప్రక్రియ తీవ్ర దుమారం రేపింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ నియామకాలను రద్దు చేసింది. మరోవైపు, వీసీ రవీందర్గుప్తా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పాలక మండలి సభ్యులు తాజాగా సర్కారుకు నివేదించారు. 2014లో నియమితులైన ఆచార్యుల వ్యవహారంపై కోర్టు ఆదేశాల మేరకు యథాస్థితిని కొనసాగించాల్సి ఉంది. అయితే, అందుకు విరుద్ధంగా ఆచార్యులకు పోస్టింగ్లు ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో వీసీ వ్యవహార శైలిపై వేర్వేరు మార్గాల్లో నివేదికలను తెప్పించుకున్న సర్కారు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నుది.
నిజామాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా హడావిడి నిర్ణయాలతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. గతంలో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కాదని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడంపై పాలకవర్గం కన్నెర్ర చేస్తోంది. 2014లో నియమితులైన పలువురు ఆచార్యుల వ్యవహారంపై ఏళ్లుగా న్యాయస్థానాల్లో విచారణ సాగుతోంది. 44 మంది ఆచార్యులను యథాస్థితిలో కొనసాగించాల్సి ఉండగా వీరికి రిజిస్ట్రార్ పోస్టులు అప్పగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులో భాగంగా వీసీ తీసుకున్న అసహజ నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుండడంతో ఈసీ సభ్యులు సర్కారుకు కీలక అంశాలపై నివేదికను సమర్పించారు. ప్రభుత్వం నియమించిన పాలకవర్గాన్ని సుప్తావస్థలో పెట్టి వీసీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న తంతును పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి వివరించారు. గతంలో సర్కారు ఇచ్చిన జీవోలను ఉల్లంఘించడం, తాజాగా కోర్టు ఆదేశాలను ధిక్కరించడం వంటి చర్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 15 నెలల్లో వీసీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, అవలంభించిన తీరు, అతని వ్యవహారంపై మూడు విధాలుగా నివేదికలను తెప్పించుకున్న సర్కారు ఇక ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రభుత్వానికి మూడు నివేదికలు..
తెలంగాణ యూనివర్సిటీలో వెలుగు చూస్తున్న గందరగోళ పరిస్థితిపై ఉన్నత విద్యా శాఖ కాలేజియేట్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ దృష్టి సారించారు. స్వల్ప కాలంలో రిజిస్ట్రార్ల మార్పు వ్యవహారంపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు రావడంపై ఆయన విచారణ కమిటీని నియమించి నివేదికను తెప్పించుకున్నారు. ఉన్నత విద్యా శాఖ నుంచి వచ్చిన ఓ బృందం ఇక్కడి వ్యవహారాలపై నాలుగు రోజుల క్రితమే నివేదికను సమర్పించింది. మరోవైపు సర్కారుకు చేరిన ఇంటెలిజెన్స్ నివేదిక సైతం టీయూలో అక్రమాలను నిర్ధారించింది. వీటికి బలం చేకూర్చే విధంగా ఈనెల 23వ తేదీన పాలకవర్గంలోని సభ్యులంతా కలిసి వీసీపై మరో నివేదికను ప్రభుత్వానికి అందించారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం, తాజాగా కోర్టు ధిక్కరణకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సెమినార్ పేరుతో వసూళ్లు..
తెలంగాణ విశ్వవిద్యాలయంలో 300 సీట్ల కెపాసిటీ, 800 సీట్ల కెపాసిటీ ఉన్న రెండు ఆడిటోరియాలున్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ భవనాల్లోని సెమినార్ హాళ్లలో జాతీయ స్థాయి సదస్సులు ఇప్పటికే చాలానే ఆయా విభాగాల అధిపతులు నిర్వహించారు. అల్ట్రాసోనిక్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్సుడ్ టెక్నాలజీ – ఇకుమ్సాట్ పేరుతో ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సును నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతోంది. యూనివర్సిటీ డబ్బులను దుబారా చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నదానిపై ఉన్నత విద్యా శాఖ దృష్టి పెట్టింది. మరోవైపు సెమినార్ పేరుతో అప్పటి అకాడమిక్ సెల్లో పని చేస్తున్న ఓ వ్యక్తి నేరుగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫోన్లు చేసి విరాళాలు సేకరించారు. నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంత మంది నేరుగా యూనివర్సిటీ బ్యాంక్ అకౌంట్లో రూ.లక్షలు జమ చేశారు. మరికొందరు వీరి చర్యలకు భయపడి నగదును ముట్టజెప్పారు. వీటి లెక్కల విషయంలో కనీసం పారదర్శకత లేకుండా పోయింది. ఈ విరాళాల ద్వారా సావనీర్ను విడుదల చేస్తామని యూనివర్సిటీ పెద్దలు హామీ ఇచ్చినప్పటికీ 20 రోజులు గడుస్తోన్నా అతీగతీ లేదు. డబ్బులిచ్చిన వారి విద్యా సంస్థల ప్రకటలను సావనీర్లో ప్రచురిస్తామని చెప్పిన మాటలు గాలి మూటలవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అదే తెగింపు..
సరిగ్గా ఆరు నెలల క్రితం యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ నియామకాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇష్టారీతిన డబ్బులు తీసుకుని అర్హత లేని వారికి పోస్టింగులు ఇచ్చి కొంత మంది వర్సిటీ పెద్దలు అభాసుపాలయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏ యూనివర్సిటీలోనూ ఎలాంటి నియామకాలు చేపట్టొద్దని ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ యూనివర్సిటీ తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు అమలయ్యాయి. అయినప్పటికీ ఇక్కడ తీరు మాత్రం మారలేదు. జూలై నెలాఖరు నుంచి ఐదుగురు వ్యక్తులు తమకు ఉద్యోగాలు వచ్చాయంటూ యూనివర్సిటీలో ఇష్టారీతిన చక్కర్లు కొడుతున్నారు. ఆయా విభాగాల్లోకి వెళ్లి అటెండెన్స్ రిజిష్టర్లో సంతకాల కోసం వెంపర్లాడుతుండడం తాజాగా వెలుగు చూసింది. 2014లో నియమితులైన కొందరు ఏకంగా అడ్డదారుల్లో ప్రమోషన్లు పొందాలని పావులు కదుపుతుండడం, అందుకు యూనివర్సిటీ పెద్దలు సానుకూలంగా స్పందించడం వంటివి అగ్నికి ఆజ్యం పోస్తోంది. తెలంగాణ యూనివర్సిటీలో నాణ్యమైన విద్యా, పరిశోధనలు జరగాల్సింది పోయి నిత్యం కొట్లాటలు, వివాదాస్పద నిర్ణయాలతో రోజురోజుకూ పరువు బజారున పడుతున్నప్పటికీ బాధ్యత ఉన్న వ్యక్తుల్లో చలనం రాకపోవడం విడ్డూరంగా మారింది. ఈ మొత్తం వ్యవహారాలకు వారం, పది రోజుల్లోనే సర్కారు నుంచి ముగింపు కార్డు పడబోతుందన్న సమాచారంతో విద్యార్థులు, యూనివర్సిటీ పరిశోధకులు, ఆచార్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.