సర్కారు పాఠశాలల్లో సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. సర్కారు బడుల్లో రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకురానున్నది. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సదుపాయం కల్పించనున్నది. దీంతో పాఠశాలలపై కరెంటు బిల్లు భారం తొలగనున్నది. ఇందుకోసం కామారెడ్డి జిల్లాలో 62 ప్రభుత్వ పాఠశాలలను మొదటి విడుతలో ఎంపిక చేసింది. అనంతరం మిగతా పాఠశాలల్లో సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించనున్నది.
లింగంపేట, డిసెంబర్ 25: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. పాఠశాలల అభివృద్ధి కోసం ఇటీవల మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేసింది. తాజాగా మరో విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లులను తగ్గించే క్రమంలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభించారు. పనుల నిర్వహణపై కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ పనులను పర్యవేక్షించడంతోపాటు వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుదీకరణ పనులను మొదట చేపడుతున్నారు. అదేవిధంగా డిజిటల్ విద్యాబోధన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ విద్యాబోధనతో విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిజిటల్ విద్యాబోధన సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం సర్కారు బడుల అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో భాగంగా మొదటి విడుతతో కామారెడ్డి జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 62 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. బాన్సువాడ మండలంలో 5, బీర్కూర్ – 2, భిక్కనూర్ -3, బీబీపేట్ – 1, బిచ్కుంద- 3, దోమకొండ -3, గాంధారి -4, జుక్కల్ -3, కామారెడ్డి -8, లింగంపేట -2, మాచారెడ్డి -3, మద్నూర్ -2, నాగిరెడ్డిపేట -2, నస్రుల్లాబాద్ -ఒకటి, నిజాంసాగర్ -2, పెద్దకొడప్గల్ -2, పిట్లం -6, రాజంపేట-3, రామారెడ్డి -3, సదాశివనగర్ -1, తాడ్వాయి -1, ఎల్లారెడ్డి మండలంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో అధికంగా ఉన్నత పాఠశాలలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. జిల్లాలో 62 పాఠశాలలను మొదటి విడుతలో అధికారులు గుర్తించారు. లింగంపేట మండలంలోని భవానీపేట, లింగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సోలార్ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి.
– రామస్వామి, మండల విద్యాశాఖ అధికారి, లింగంపేట