సిటీబ్యూరో: బోనాల ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా, చార్మినార్, గోల్కొండ జోన్లు మినహా చాలా జోన్లలో టెండర్లు ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలోనే గత డిసెంబర్ నెల నుంచి బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలతో పాటు కొత్త పనులకు సంబంధించిన నిధులను విడుదల చేయకపోతే, ఉత్సవాలకు సంబంధించిన పనులన్నింటినీ నిలిపివేస్తామని కొందరు కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
ఈ నెలాఖరు నాటికల్లా తొలుత మార్చి నెల వరకు ఉన్న బిల్లులన్నీ చెల్లిస్తామని అధికారులు చెబుతుంటే.. నెలాఖరు వరకు వేచి చూడటం వల్ల పండుగ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు కాంట్రాక్టర్లు. మొత్తంగా కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు మార్చి నాటి బిల్లుల ప్రాసెసింగ్ను వీలైనంత త్వరగా ముగించి వెంటనే నిధులు విడుదల చేస్తారా? ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అన్నది వేచి చూడాల్సిందే.