నిజామాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ఓ వైపు సహాయ నిరాకర ణ చేస్తున్నా… రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి రా వాల్సిన నిధుల వాటాను నిలిపేసినా… రాష్ట్రంపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నా… సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మాత్రం అభివృద్ధిలో దూకుడును ప్రదర్శిస్తున్నది. ప్రజలకు అందించాల్సిన సంక్షేమ ఫలాలను దరి చేరుస్తూనే కేంద్రం అవలంబిస్తున్న కుట్రలను ఛేదిస్తున్నది. సమైక్య రాష్ట్రంలోనూ ఎప్పుడు ప్రవేశ పెట్టని విధంగా ఏకంగా రూ.3లక్షల కోట్ల చేరువలో బడ్జెట్తో కేసీఆర్ సర్కారు రికార్డును సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విత్త మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ద్వారా అన్ని వర్గాలకు లాభం చేకూరబోతున్నది. ఇప్పటికే అమలవుతున్న పథకాలతో పాటు ఆయా వర్గాల ప్రజల అవసరాలను గు ర్తిస్తూ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్పై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మేధావులు, ఉద్యోగ వర్గాలు, సామాన్యులు, వాణిజ్య, వ్యాపారులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి చెబుతున్నట్లే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం లాంఛనంగానే జరుగనున్నది. మొన్ననే కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ యావత్ దేశ ప్రజలను నిరాశకు గురి చేయగా రాష్ట్ర బడ్జెట్ ఊరటను అందిస్తుండడం విశేషం.
గత వాగ్దానాలు అమలు ఇలా…
చెప్పింది చేయడమే కాదు… చెప్పని పనులను కూడా చేసి చూపించడంలో కేసీఆర్ ప్రత్యేకతే వేరు. ఇందుకు చక్కని ఉదాహరణే నేతన్నలకు బీమా పథకం, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాలు. గత బడ్జెట్లో కరోనా కటకటాల్లోనూ మంత్రి హరీశ్రావు ఈ అంశాలపై స్పష్టమైన ప్రకటనను అందించారు. కేసీఆర్ ఆదేశాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పథకాలు సైతం ప్రారంభానికి నోచుకోవడం విశేషం. ఇందులో నేతన్నకు బీమా పథకం ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 45 మంది చేనేత కుటుంబాలకు ప్రయోజనం చేకూరబోతున్నది. ఇప్పటికే వీరందరికీ పథకాన్ని వర్తింపజేస్తూ జౌళి శాఖ ఉత్తర్వులు సైతం విడుదల చేసింది. మరోవైపు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం కూడా లాంఛనంగా ఇప్పటికే ప్రారంభమైంది. ఈ విశిష్టమైన పథకాన్ని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఏకంగా కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచే షురూ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2022, డిసెంబర్ 21న ప్రారంభమైన పథకం ద్వారా కామారెడ్డి జిల్లాలోని 16వేల మంది గర్భిణులకు లాభం జరుగనున్నది. ఇందులో రూ.3 వేలు విలువ చేసే విలువైన పౌష్టికాహార సామగ్రిని అందిస్తున్నారు. ఆర్థిక మంత్రి తాజా ప్రకటనతో నూతన ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాల్లోనూ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు కాబోతుండడంతో కొత్తగా నిజామాబాద్ జిల్లాకు ప్రయోజనం జరుగనున్నది. సుమారు 15వేల మందికి పైగా గర్భిణులకు లబ్ధి చేకూరనున్నది. 57 ఏండ్లకే పింఛన్ల పంపిణీ సైతం అమలై ఆయా వర్గాలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నదనడానికి ఇంతకంటే నిదర్శనమే అక్కర్లేదు. అదే కేంద్ర సర్కారు మాత్రం ఎన్నికలప్పుడు ఒక మాట.ఎన్నికలైన తర్వాత మరోమాట అన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజలను నిలువునా ముంచుతున్నది.
మెడికల్ కాలేజీ లాంఛనమే…
కామారెడ్డి ప్రాంత ప్రజలకు ఎన్నో ఏండ్ల కలగా మిగిలిన మెడికల్ కాలేజీ ఈ కొత్త సంవత్సరంలోనే లాంఛనంగా ప్రారంభం కానున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ పరిపాలన షురూ అవుతుంది. ఇందుకు బడ్జెట్లో హరీశ్ రావు ప్రకటన బలాన్ని చేకూరుస్తున్నది. ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అనేక సభల్లోనూ ఈ సంవత్సరంలో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నట్లుగా చెప్పారు. మంత్రి కేటీఆర్ సైతం ఇదే మాటను చెప్పారు. తాజాగా ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ రావు చేసిన ప్రకటనతో పనుల్లో వేగం మరింత పుంజుకోనున్నది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనే తాత్కాలికంగా మెడికల్ కాలేజీని నెలకొల్పేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే దవాఖాన కోసం ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ మూలంగా కామారెడ్డి ప్రాంత ప్రజలతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాలకు చెందిన వారెందరికో ఉపయుక్తం కానున్నది. జాతీయ రహదారి 44 కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పైన పేర్కొన్న జిల్లాల ప్రజలు సులువుగా వైద్యం కోసం తరలి వచ్చే వీలున్నది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ ప్రాంత ప్రజలందరికీ మెడికల్ కాలేజీతో ఎంతో లాభం చేకూరబోతున్నది.
సంక్షోభం నుంచి సంక్షేమం వైపు…
2020 ప్రథమార్థం నుంచి యావత్ ప్రపంచాన్ని కరోనా భూతం చిందరవందర చేసింది. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం కావడంతో అనేక ప్రభుత్వాలు అతలాకుతలమయ్యాయి. 2022 తర్వాతి కాలంలో పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో పూర్వ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా మూలంగా ప్రజానీకం అనుభవించిన కష్టాలు అనేకం. ఈ సమయంలో మానవత్వాన్ని మరిచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎడాపెడా ఇంధన ధరలను పెంచి రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. ఎల్పీజీ ధరలను సైతం విచ్చలవిడిగా పెంచేసింది. కరోనా బూచీని చూపించి సామాన్యులను హింసించి కార్పొరేట్ పెద్దలకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తూ ద్వంద్వ నీతిని అవలంబిస్తోంది. కానీ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో సంక్షేమం పరుగులు పెడుతూనే ఉంది. కరోనా గడ్డు కాలాన్ని సాఫీగా దాటుకొని విజయవంతంగా ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తోంది. ముఖ్యంగా రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు భారీ కేటాయింపులు జరపడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మోదీ సర్కారు మాత్రం మొన్నటి బడ్జెట్లో రైతులను నిండుగా ముంచింది. కిసాన్ సమ్మాన్ నిధికి నిధులను కోత పెట్టింది. కేవలం రుణ పంపిణీకి మాత్రమే లక్ష్యాన్ని పెట్టుకొని సాయం చేసేందుకు మాత్రం మోకాలడ్డు పెడుతున్న దుస్థితి బహిర్గతమైనదే.
పల్లెలకు వెన్నుదన్ను…
రాష్ట్ర బడ్జెట్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి గతం మాదిరిగానే ప్రాధాన్యత దక్కింది. కొద్ది రోజులుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులకు ఇందులో పరిష్కారం లభించినట్లు అయ్యింది. ఆర్థిక సంఘం నిధులతో పాటు ప్రభు త్వం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులన్నీ జీపీ అకౌంట్లలోనే జమ చేయబోతున్నారు. మరోవైపు ఖర్చులకు ఆర్థిక శాఖ, ట్రెజరీ బిల్లుల మంజూరు సమస్యలకు చెక్ పడింది. ఈ విషయంలో సర్పంచులకు సౌలభ్యం ఇవ్వడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుకు వరుసగా మూడో ఏటా ప్రభుత్వం ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే లక్ష్యానికి అనుగుణంగా సాగు పెరుగుతున్నది. ఇప్పుడు మరింత ఊపందుకోనున్నది. సామాజిక మార్పు కోసం తీసుకు వచ్చిన దళితబంధు పథకానికి వరుసగా ఈ సారి కూడా నిధులివ్వడంతో ద్వారా ఉమ్మడి జిల్లాలో దళిత జాతికి చెందిన అనేక కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. మొదట్లో ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో నిధుల మంజూరుతో దాదాపు అసెంబ్లీ సెగ్మెంట్కు 1500 యూనిట్లు మంజూరు అయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. వీటి గ్రౌండింగ్ ప్రక్రియ త్వరలోనే జరుగనున్నది. కొత్త ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపుతో 2023-24లోనూ అనేక మంది దళిత కుటుంబాలకు లబ్ధి జరుగనున్నది. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ఆయా రంగాలకు కేటాయింపులతో ప్రజల మెప్పును పొందుతున్నది.
ప్రజాప్రయోజనాలకు పెద్దపీట
ఆర్మూర్, ఫిబ్రవరి 6: బడ్జెట్లో ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా నిధు లను కేటాయించారు. రాష్ట్రంలో జోడెడ్ల మాదిరిగా అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందనడానికి ఈ బడ్జెటే సాక్ష్యం. తెలంగాణకు నయాపైసా ఇవ్వకుండా నయ వం చన చేస్తున్న కేంద్రం వివక్షను ఈ బడ్జెట్ బద్దలు కొట్టింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న బడ్జెట్ ము మ్మాటికి సకలజనుల సంక్షేమానికి దోహదం చేస్తుంది.
-ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
వ్యవసాయరంగ బడ్జెట్
డిచ్పల్లి, ఫిబ్రవరి 6: ఇది వ్యవసాయరంగ బడ్జెట్. వ్యవసాయ రంగానికి రూ.26, 931 కోట్లు కేటాయించడం శుభపరిణామం. రైతుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. రైతుబంధుకు రూ.15,075 కోట్లు, రుణమాఫీకి 6,385 కోట్లు, బీమా కోసం రూ.1589 కోట్లు, ఆయిల్పామ్ రైతులకు రూ.1000 కోట్లు కేటాయించడం అభినందనీయం.
-డాక్టర్ తోకల సంపత్, అర్ధశాస్త్ర విభాగాధిపతి, తెలంగాణ యూనివర్సిటీ
పేదల వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన సర్కారు
ఆధునిక సాంకేతిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల భర్తీ, వైద్యశాఖకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయించడం బాగున్నది.
– విద్యావతి, బాన్సువాడ
పట్టణాలు అభివృద్ధి చెందుతాయి..
పట్టణాల అభివృద్ధికి సుమారు రూ.11వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం చాలా సంతోషంగా ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రాబోవు రోజుల్లో పట్టణాలు అభివృద్ధి చెందితే అన్ని వ్యాపారాలు, పరిశ్రమలు వస్తాయి. మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి
-విఠల్, బాన్సువాడ