నిజామాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గొర్రెల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టిని చేసేందుకు సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. మహోన్నత లక్ష్యంతో కూడుకున్న భిన్న ప్రయోజనాలు కలగలిసిన ఈ కార్యక్రమంలో అవినీతి ఛాయలేవీ మచ్చుకూ కనిపించకుండా ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 329 సొసైటీల్లో 20,971 సభ్యులుండగా… కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 314 సొసైటీల్లో 17,500 మంది సభ్యులున్నారు. తొలి విడుతలో అర్హులైన లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను రాయితీపై అందించగా, రెండో విడుత పంపిణీ కోసం సర్వం సిద్ధం చేశారు. రెండో విడుతలో నిజామాబాద్ జిల్లాలో 19,106 మందిని, కామారెడ్డి జిల్లాలో 6,099 మందిని అధికారులు గుర్తించారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని యూనిట్ ధరను ప్రభుత్వం పెంచింది.
నాణ్యమైన జీవాలు.. అక్రమాలకు కళ్లెం..
2017 సంవత్సరంలో గొర్రెల పెంపక వృత్తిపై ఆధారపడ్డ ప్రాథమిక గొర్రెల మేకల పెంపక సహకార సంఘ సభ్యులైన గొల్ల, కురుమ, యాదవ సభ్యులకు 75శాతం రాయితీతో యూనిట్లు కేటాయించారు. గతంలో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు ఉండగా ఇప్పుడు 50వేలు పెంపుతో రూ.1.75లక్షలకు చేరింది. పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్ ధరను సైతం పెంపుదల చేయడంతో నాణ్యమైన జీవాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడింది.
మరోవైపు పంపిణీ చేసిన ప్రతి గొర్రె ఫొటోతోపాటు లబ్ధిదారుల ఫొటోను ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ జీవ సమృద్ధి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొనుగోలు చేసిన గొర్రెలను రవాణా చేసే వాహనాలు బయల్దేరినప్పటి నుంచి అవి గ్రామాలకు చేరే వరకు జీపీఎస్ విధానం అమలు చేయాలని సర్కారు ఆదేశాలిచ్చింది. ఇలా పకడ్బందీ చర్యలతో గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాలకు సర్కారు కళ్లెం వేసింది. రెండో విడుతలో అర్హులైన వారికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రక్రియ షురూ కావడంతో ఉభయ జిల్లాల్లోనూ అర్హులకు గొర్రెల పంపిణీ జరుగనున్నది.
గొల్ల, కురుమల ఉపాధికి ఊతం
బోధన్ రూరల్, జూన్ 10: మా కులవృత్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ సారు మాకు గొర్రెలను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేయ డం హర్షణీయం. గతంలో ఇతరుల వద్ద పనిచేసే మేము గొర్రెల పంపిణీతో స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
– బైడి గంగాధర్, పెగడాపల్లి, బోధన్ మండలం
గొర్రెల పంపిణీ దేశానికే ఆదర్శం
ఖలీల్వాడి, జూన్ 10: స్వరాష్ట్రంలో యాదవులకు గుర్తింపు వచ్చింది. సీఎం కేసీఆర్ యాదవులకు గొర్రెలను పంపిణీ చేసి గౌరవంగా బతికేలా చేశారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు. అన్నివర్గాలకు సముచిత న్యాయం చేస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ ఒక్కరే.
– మంజూల యాదవ్,
అఖిల భారత మహాసభ యాదవ సంఘం అధ్యక్షురాలు
యాదవులను ఆదుకుంటున్నరు..
ఖలీల్వాడి, జూన్ 10: యాదవులకు గొర్రెలను అందజేసి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే. జిల్లా లో ఇప్పటికే మొదటి విడుత పంపిణీ చేసిన గొర్రెలతో మందలు కళకళలాడుతున్నాయి. గొర్రెలను పంపిణీ చేసి యాదవుల ఆర్థికాభ్యున్నతికి కృషి చేయడం గొప్పతనం. మాకు తగిన గౌరవం దక్కింది. రెండో విడుతతో మరికొంత మందికి సర్కారు ఫలాలు దక్కనున్నాయి. మాకోసం ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు.
– రాజేందర్ యాదవ్, యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
మా జీవితాల్లో కొత్త వెలుగులు
బోధన్ రూరల్ , జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల ద్వారా చేయూత అందించడం చాలా సంతోషంగా ఉన్న ది. గొర్రెలు అందించడం ద్వారా ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కుల వృత్తులను కాపాడుకుంటూ సమాజంలో గౌరవంగా బతికేలా సీఎం కేసీఆర్ సార్ కృషి చేస్తున్నాడు. మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాడు.
– మేడి రవి, కురమ సంఘం మండల అధ్యక్షుడు, బోధన్