మెండోరా : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తుతుందని ఈఈ చక్రపాణి సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఉదయం క్రమక్రమంగా ఇన్ఫ్లో పెరుగుతుండటం, వర్షాలు మరింతగా పెరుగుతుండడంతో గోదావరిలో నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుందని అన్నారు. ఎస్సారెస్పీలోకి రాత్రి 9 గంటలకు 2,20,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం వుందని ప్రజలు, మత్స్యకారులు గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.
అదేవిధంగా దిగువ గోదావరిలోకి రిజర్వాయర్ నుంచి 32 వరద గేట్లనుంచి 2,74,890 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దీంతో గోదావరి నిండుగా ప్రమాదకరంగా ప్రవహిస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిదులు ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.00 అడుగులు 84.810 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఆయన తెలిపారు.