ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించేలా తెలంగాణలోనూ ఓ దివ్య క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ తిరుమలగా పేరొందింది. ప్రకృతి అందాలు, పచ్చని పంటల పొలాల నడుమ ఎత్తయిన కొండపై కొలువుదీరిన ఆధ్యాత్మిక క్షేత్రంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి మూడో తేదీ వరకు ఆరో రోజులపాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. మార్చి 1న నిర్వహించనున్న స్వామి వారి కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్నారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ కొండపై కొలువుదీరాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవప్రియుడు, అలంకారప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజనవల్లభుడు. చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తయిన కొండలు, మరోవైపు సరస్సు.. ఆహ్లాదకర వాతావరణంలో కొలువై ఉన్నాడు. ఆధ్యాత్మికతకు చిరునామాగా విరాజిల్లుతున్న తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అన్నిఏర్పాట్లూ పూర్తిచేశారు.
బాన్సువాడ/బీర్కూర్, ఫిబ్రవరి 25: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ తిరుమల దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో వేడుకలు మొదలుకానున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరారుతున్నదీ వెంకన్నకొండ. స్వరాష్ట్రంలో ఆలయాలకు సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని పురాతన ఆలయాలు మొదలుకొని, నూతన ఆలయాల నిర్మాణం వరకు ఆధ్మాత్మిక క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానం (తెలంగాణ తిరుమల తిరుపతి) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది.
తిమ్మాపూర్ తిరుమల దేవస్థానంలో భక్తుల కోసం ప్రభుత్వం అందించిన నిధులతో మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరు చేసిన రూ.23కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. సుమారు 90శాతం మేర పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ సహకారం, స్పీకర్ పోచారం ప్రత్యేక కృషితో ఆలయం సర్వాంగా సుందరంగా ముస్తాబయ్యింది. ఆలయ కింది భాగంలో ఉన్న చెరువును మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మినీ ట్యాంక్బండ్గా మార్చారు. సరస్సులో బోటింగ్ ఏర్పాటు, మందిరంలో రిటర్నింగ్ వాల్స్, ప్రాకార మండపం, మాఢవీధులు, రెండు రాజగోపురాలు, రెండు గాలి గోపురాలు, మందిర ఆవరణలో గ్రానైట్, పైన రేకుల నిర్మాణం, గుడి చుట్టూ ఇత్తడితో అల్లికలు, ఆలయ పైభాగంలో స్వామి వారి కల్యాణమండపం, యజ్ఞశాల, ప్రాకారాలు అష్టముఖి శాలహారాలు, కల్యాణకట్ట, యాగశాల, పుష్కరేణి, భక్తుల వివాహాది శుభకార్యాలకు కల్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం 54 సూట్లతో అతిథి గృహం, అలిపిరి నుంచి స్వామి వారి మందిరం వరకు డబుల్ బీటీ రోడ్డు తదితర పనులను వేగవంతంగా చేపట్టారు.
బీర్కూర్ మండల శివారులోని కొండపై ఓ భక్తుడు చిన్న ఆలయాన్ని నిర్మించగా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కుటుంబీకుల ప్రత్యేక కృషితో ఈ ఆలయం.. ఆధ్యాత్మికతకు చిరునామాగా నిలిచింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్పీకర్ పోచారం విన్నపం మేరకు 2017 నవంబర్ 25న బాన్సువాడ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. ఆలయంలో నిర్వహించిన బ్రహ్మాత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం మొదటగా రూ.13కోట్ల నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లో వెంకన్నకొండ అభివృద్ధికి మరో రూ.10కోట్లను విడుదల చేస్తూ జీవోను జారీ చేశారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.23 కోట్లతోపాటు స్పీకర్ పోచారం కుటుంబీకులు, భక్తులు ఇచ్చిన విరాళాలతో స్వామి వారి ఆలయం దివ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
తెలంగాణ తిరుమల దేవస్థానం అష్టమ వార్షిక బ్రహోత్సవాలు ఈ నెల 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 26న సాయంత్రం 6 నుంచి 9గంటల వరకు అంకురార్పణ, 27వ తేదీన ధ్వజారోహణం, 28న శ్రీశ్రీశ్రీ దేవానాద రామానుజ జీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో తీర్థగోష్టి, మార్చి 1న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, 2న స్వామి తోరణపూజ, ధ్వజ కుంభారాధన, నిత్యహవనం, పూర్ణాహుతి , బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం వేళల్లో పుర వీధుల్లో స్వామి వారి రథోత్సవం, రైతునగర్ గ్రామస్తుల కోలాటాలు , చివరి రోజు 3న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం , మాఢవీధుల్లో ఆశ్వవాహనంపై స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాలతో బ్రహోత్సవాలు సంపూర్ణమవుతాయి.
తెలంగాణ తిరుమల దేవస్థానం బ్రహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హాజరుకానున్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా మార్చి 1న స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయంలో స్వామి వారికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రెండున్నర కిలోల బంగారు కిరీటాన్ని స్వామి వారికి అందించనున్నారు.