కాళేశ్వర గంగా కదిలొస్తున్నది. శ్రీరాంసాగర్ వైపు పరుగులెడుతున్నది. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు జీవం పోసేందుకు కాళేశ్వరం నుంచి బిరబిరా తరలివస్తున్నది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం ఆందోళనలో ఉన్నది. అన్నదాతలంతా ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రెండ్రోజుల క్రితం ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని లక్ష్మీపూర్ బరాజ్ నుంచి వరద కాలువలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ జలాలు ఇప్పటికే జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్ పంప్హౌస్కు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాజరాజేశ్వరరావుపేట పంప్హౌస్కు లిఫ్ట్ చేస్తున్నారు. నేడో రేపో ఇక్కడి నుంచి ఎత్తిపోసి, ముప్కాల్లోని పంప్హౌస్ ద్వారా ఎస్సారెస్పీకి చేర్చనున్నారు. తద్వారాశ్రీరాంసాగర్ను నింపి ఆ నీటిని లక్షలాది ఎకరాల సాగుకు మళ్లించనున్నారు. కాళేశ్వరం జలాలు తరలివస్తున్న తరుణంలో.. రైతాంగంలో నెలకొన్న ఆందోళన తొలగిపోతున్నది. సాగుకు ఇక ఢోకా లేదని మురిసిపోతున్నది.
నిజామాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడనున్నాయి. వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ నైపుణ్యం ద్వారా కాళేశ్వ రం నీళ్లు బిరబిరమంటూ తరలిరానున్నాయి. 2023 వానకాలంలో మొగులు దోబూచులాడుతుండడంతో రైతులు దిగాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం నీటితో రైతుల పంట పొలాలను తడిపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లు చారిత్రక పోచంపాడ్ ప్రాజెక్టును చేరా యి. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన అనంతర కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో పునర్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని నింపే అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు జూన్ మాసం ముగిసినప్పటికీ లోటు వర్షపాతమే నమోదు కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు కు ఇబ్బందులను తొలగించేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు మొదలవ్వగా నేడో రేపో కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరనున్నాయి.
రోజుకు అర టీఎంసీ…
ఒకప్పుడు వరద కాలువ అంటే బోసిపోయిన పరిస్థితులు, చెత్తా చెదారంతో నిండినట్లు ఉండేది. వరద కాలువలో నిరంతరం నీళ్లను చూస్తున్న రైతుల్లో కొంత కాలంగా ఆనందం కనిపిస్తోంది. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని వరద కాలువల్లో నిరంతరం నీళ్లుండడంతో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో సుమారుగా 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్న ది. ఇదే సమయంలో ఏడాది మొత్తంగా ఎస్సారెస్పీకి 60 టీఎంసీల నీళ్లను పంపించడంతో పాటు జగిత్యాలలో వందలాది చెరువుల్లో గోదావరి నీళ్లను నింపాలనే లక్ష్యంతో పునర్జీవ పథకం ఉద్దేశంతో భూగర్భ జలసిరులు కూడా పెరుగుతున్నా యి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పునర్జీవ పథకంలో రోజుకు అర టీఎంసీ చొప్పున వరద కాలువ నుంచి ఎస్సారెస్పీకి 60 టీఎంసీలు చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే వరద కాలువల్లో నీళ్లు సమీప ఆయకట్టు పంటలకు మేలు చేకూరుస్తున్నాయి. పునర్జీవ పథకంలో మొదటి పంప్ హౌస్ను జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ సమీపంలో నిర్మించారు. రెండో పంప్హౌస్ను ఇబ్రహీంపట్నం మండలం రాజరాజేశ్వర్ రావు పేట వద్ద నిర్మించారు. ఈ రెండు పంప్ హౌస్ల ద్వారా అవసరమైనప్పుడు వరద కాలువను నింపుతారు. మూడోది ఎస్సారెస్పీ సమీపంలో 0.100 కిలో మీటర్ వద్ద నిర్మించారు. ఇక్కడి నుంచి నీళ్లను ఎత్తి పోచంపాడ్ ప్రాజెక్టులో పోస్తారు.ఒక్కో పంప్ హౌస్లో ఎనిమిది మో టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పంప్ ద్వారా 1,450 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉంది. మొత్తం 8 మోటర్ల ద్వారా 11,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్థ్యముంది.
అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యం…
కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ప్రాజెక్టు పనులు వేగంగా పూరయ్యాయి. 2017, ఆగస్టు 10వ తేదీన సీఎం కేసీఆర్ ఈ పథకానికి భూమి పూజ చేశారు. రూ.1067 కోట్ల వయ్యంతో ఎస్సారెస్పీ నీళ్లను దిగువకు పారించే వరద కాలువలపై మూడు చోట్ల రివర్స్ పంప్ల నిర్మాణాల్ని చేపట్టేలా కార్యరూపం దాల్చారు. అనుకున్న విధంగానే రెండేండ్ల కాల వ్యవధిలోనే ఈ పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలోని మూడో పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కాగా ఎస్సారెస్పీలో నీళ్లు లేని సమయంలో నేరుగా కాళేశ్వరం జలాలను ప్రాజెక్టులోకి మళ్లిస్తున్నారు. కరీనంగర్ జిల్లా లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోసిన నీళ్లు రాంపూర్కు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న నూకపల్లి వరకు చేరుకుంటున్నాయి. ఎస్సారెస్పీ వరకు ప్రతి 30 కిలో మీటర్ దూరానికి ఒక రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు ఉండడంతో మూడు చోట్ల నీళ్లు నిల్వ అవుతూ అక్కడి నుంచి వేగంగా ముందుకెళ్తుండడం విశేషం. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వరద కాలువ నుంచి 0.100 కిలో మీటర్ పాయింట్ వద్ద మూడో పంప్ హౌస్లోని మోటర్లు కాళేశ్వరం నీళ్లను వరద కాలువ నుంచి ఎత్తి పోచంపాడ్లోకి పోస్తాయి.
చిన్న ఎత్తిపోతలకు జీవం…
నిజామాబాద్ జిల్లాలో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. వీటికి మూలాధారం ఎస్సారెస్పీ బ్యాక్ వాటరే. ప్రస్తుతం 20 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఎత్తిపోస్తే ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. పునర్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం జలాలు చేరితే ఈ ఎత్తిపోతల పథకాలకు సైతం జీవం సంతరించుకోనున్నది. గుత్ప ఎత్తిపోతల ద్వారా 540 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 720 క్యూసెక్కులు చొప్పున ఎస్సారెస్పీ ద్వారా కాళేశ్వరం నీళ్లను వదలనున్నారు. వీటితో పాటే చిన్నాచితక ఎత్తిపోతల పథకాలకు సైతం ఎస్సారెస్పీకి చేరే కాళేశ్వరం జలాలే ఆయువు పట్టుగా నిలువబోతోంది. సీఎం ఆదేశాలతో కదిలిన కాళేశ్వరం జలాల రాకను ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం నీళ్లను ముప్కాల్ పంప్ హౌస్ నుంచి ఎత్తి ప్రాజెక్టులో పోయడం ద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు వానకాలం సీజన్లో భరోసా కల్పించనున్నది.
రాంపూర్ పంప్హౌస్కు చేరిన జలాలు
గోదావరి జలాలు సోమవారం రాత్రికే మల్యాల మండలం రాంపూర్ (వరదకాలువ 73వ కిలో మీటర్) వద్ద నిర్మించిన పంప్హౌస్కు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం 7:30 గంటల నుంచి ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ఈ పంప్హౌస్లోని 8 మోటర్లలో ఒక దానిని ప్రారంభించారు. 11 గంటల ప్రాంతంలో మరో మోటర్ను, మధ్యాహ్నం 4 గంటల సమయంలో నాలుగు మోటర్లను ప్రారంభించి ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటర్ ద్వారా 1450 క్యూసెక్కుల చొప్పున మొత్తం 5,800 క్యూసెక్కుల నీటిని రాంపూర్ పంప్హౌస్ నుంచి ఎగువకు తరలిస్తున్నారు.
నేటి ఉదయానికి రాజేశ్వర్రావుపేటకు
రాంపూర్ వద్ద ఎత్తిపోసిన జలాలు బుధవారం ఉదయం 11 గంటల వరకు రాజేశ్వర్రావుపేట (వరదకాలువ 34వ కిలోమీటర్) పంప్హౌస్కు చేరుతాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడికి చేరిన నీటిని పంప్హౌస్ ద్వారా ఎగువన ఉన్న ముప్కాల్ (0.10 కిలోమీటర్) పంప్హౌస్ వరకు తరలిస్తారు. అక్కడ నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి ఎత్తిపోయనున్నారు.
వరద కాలువకు జలకళ
మోర్తాడ్, జూలై 4 : కాళేశ్వరం జలాలు వచ్చినప్పటి నుంచే వరద కాలువ జలకళను సంతరించుకున్నది. గతంలో వర్షాకాలంలో మాత్రమే వరదకాలువ కొన్ని రోజులు నిండుగా కనిపించేది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తరువాత ఏడాదంతా వరదకాలువ నీటితో నిండి ఉంటున్నది. వరదకాలువలో బోర్లు వేసుకునే వాళ్లం, కానీ ఇప్పుడు మోటర్లు పెట్టుకుని పంటలకు నీటిని పారిస్తున్నాం. వేసవికాలంలో కూడా వరదకాలువలో నీరు ఉండడంతో రైతులకు సాగు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు దూరమయ్యాయి.
-చొక్కాయి గంగారెడ్డి, రైతు, మోర్తాడ్
పైప్లైన్లు వేసుకొని నీరు పారిస్తున్నాం
వరదకాలువలో ఎప్పుడు నీళ్లు ఉండడంతో సమీపంలో ఉన్న రైతులకు సాగునీటికి ఢోకా లేదు. దూరంగా ఉన్న భూములకు కూడా పైప్లైన్లు వేయించుకొని పంటలకు నీటిని అందిస్తున్నాం. వరదకాలువ సమీపంలో ఉన్న భూములు యాసంగిలో పంటలు పండించే వారిమి కాదు. వరదకాలువలో ఎప్పుడూ నీళ్లు ఉండడంతో యాసంగిలో కూడా పంటలు వేసుకుంటున్నాం. వరదకాలువకు కాళేశ్వరం జలాలు తీసుకురావడంతో రైతులకు ఎంత లాభం చేకూరుతుందనేది మాటల్లో చెప్పలేను.
-ప్రభుదాస్, రైతు, మోర్తాడ్
సాగు,తాగునీటికి ఢోకా లేదు
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి నీళ్లను పైకి తీసుకువచ్చి ఏడాదంతా వరదకాలువ నిండుకుండలా ఉండేలా చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి మేలును మరిచిపోలేం. ఇదొక అద్భుతమని చెప్పవచ్చు. ఒకప్పుడు పంటలకు సాగునీరే కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడే వాళ్లం. కానీ ఇప్పుడు వరదకాలువలో ఏడాదంతా నీళ్లు ఉండడంతో.. వర్షాలు లేకపోయినా కాళేశ్వరం జలాలు ఎగువకు తీసుకొచ్చి నింపడంతో భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లో నీళ్లు ఎండిపోవడం లేదు. దీంతో సాగుకే కాదు తాగునీటికి కూడా ఢోకా లేకుండా పోయింది.
-గడ్డం చిన్నారెడ్డి, రైతు, తిమ్మాపూర్
కాళేశ్వరం అద్భుత సృష్టి
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత సృష్టి. దిగువన ఉన్న నీళ్లను ఎగువకు తీసుకురావడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలను పటాపంచలు చేశారు. కాళేశ్వరం ద్వారా వరదకాలువను నింపడం అదికూడా వర్షాభావ పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా రైతులు, ప్రజల కోసం ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి ఎంత ముందుచూపుతో ఉన్నారో తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తరువాత వరదకాలువలో ఎల్లప్పుడు నీళ్లు ఉండే లా చూడడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు విపరీతంగా పెరిగాయి. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
-తాటిపల్లి శ్రీనివాస్, రైతు, దొన్కల్