మోస్రా (చందూర్), మార్చి 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటితో కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం పుష్కలంగా నిధులు మంజూరుచేస్తున్నదని తెలిపారు. మోస్రాలోని రైతు వేదికలో ఎంపీపీ పిట్ల ఉమా శ్రీ రాములు అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో చాలామంది బాధ పడుతున్నారని తెలిపారు. వర్షం ద్వారా సింగూరు డ్యాంలో చేరిన నీటిని శుద్ధి చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటే.. 24 గంటలపాటు మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు సురక్షిత మైన నీటిని అందించవచ్చన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయినట్లు తెలిపారు. మార్చి తర్వాత అర్హుల్లో ఇంకా ఎవరైనా ఇల్లు కట్టుకునేవారు ఉంటే రూ. మూడు లక్షల స్కీంలో అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రూ. మూడు లక్షలు మూడు విడుతల్లో లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు. మోస్రాలో రూ.7.70 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి రోడ్డు వేసుకోవాలంటే కిలో మీటరుకు రూ.2లక్షలు అందజేస్తామని తెలిపారు. మండలంలోని షాదీఖానపై షెడ్డు కోసం మరో రూ.20 లక్షలు మంజూరుచేసినట్లు చెప్పా రు. కాంట్రాక్టర్లు పనులు చేపట్టే సమయం లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని సూచించారు. నాణ్యతతో పనులు చేపట్టి పది కాలాలపాటు ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు రైతుబీమా, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్ రూం ఇండ్ల చెక్కులను అందజేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో తమ గ్రామంలో కొత్తగా ఏర్పడిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో నీటి సౌకర్యం కల్పించాలని గోవూర్ సర్పంచ్ నరేందర్రెడ్డి.. స్పీకర్ను కోరారు. వెంటనే పనులు ప్రారంభించాలని మిషన్ భగీరథ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పలువురు తెలుపగా.. భవన నిర్మాణాలకు అనుమతి లభించిందని సభాపతి తెలిపారు. అంతకుముందు అధికారులు తమ శాఖలకు చెందిన ప్రగ తి నివేదికలను చదివి వినిపించారు. జడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కవిత, ఎంపీడీవో భారతి, సర్పంచ్ సుమలతా రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.