బాలరాముడు తన సొంత ఇంటికి చేరిన వేళ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని రామాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఇతరత్రా ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు, స్వామి వారికి విశేష అలంకరణ, అష్టోత్తర శతనామార్చన, రామాయణ పారాయణం చేశారు. మధ్యాహ్నం 12గంటల నుంచి అయోధ్యలో నిర్వహించిన కార్యక్రమాల ప్రసారాలను ప్రత్యేక ఎల్ఈడీ స్కీన్లపై ప్రజలంతా వీక్షించారు. ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో భజనలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరాముడి విజయమంత్రం జపించారు. ఆలయాల వద్ద అన్నదానాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడళ్లలో, ఇండ్లపై కాషాయ జెండాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పట్టణాల్లో ఆయా సంస్థల ప్రతినిధులంతా విగ్రహ ప్రతిష్ఠ శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్లు, బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు.
– నిజామాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగగా… ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తజనం పరవశించి పోయింది. ఎన్నో ఏండ్ల కల సాక్షాత్కారం కావడంతో రామాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి శ్రీరాముడ్ని కొలిచారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం వందల ఏండ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నెరవేరడంతో అంతటా సంబురం కనిపించింది. పలు వివాదాలు, న్యాయ పోరాటాల అనంతరం రామాలయ పునర్నిర్మాణం, బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12.20గంటలకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ, కుంభసంప్రోక్షణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూ వాహినితోపాటు పలు ధార్మిక సంస్థలు ఇచ్చిన సూచనల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలతోపాటు ఇండ్లలోనూ వేడుకలు నిర్వహించారు.
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ దేశమంతటా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం సెలవు ప్రకటించాయి. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సెలవుపై నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సుమూహూర్తాన జరిగిన కార్యక్రమాలను టీవీల్లో చూసిన జనాలంతా జైశ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. అద్భుతమైన ఘడియ కోసం వేయి కండ్లతో ఎదురుచూసిన వారంతా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన అపురూపమైన చారిత్రక ఘట్టాన్ని కండ్లారా వీక్షించారు. వివిధ చారిత్రక ఘట్టాల్లో పాల్గొన్న కర సేవకులంతా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నాటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు.