నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 25: జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన నిజామాబాద్ రూరల్లో గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా త్రిముఖ పోటీ కొనసాగనున్నది. బీఆర్ఎస్ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బాజిరెడ్డి గోవర్ధన్.. పార్టీ ఆదేశాల మేరకు మూడోసారి కూడా బరిలో ఉన్నారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బాజిరెడ్డి బీఫారం కూడా అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారు చేస్తామని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మూడు నెలల ముందుగానే ప్రకటించడంతో బాజిరెడ్డి అందుకనుగుణంగా అన్ని మండలాల్లోనూ పార్టీ క్యాడర్ను పటిష్టం చేసి, ప్రచారంలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. విపక్ష పార్టీల నాయకులు చేసే అబద్ధపు ప్రచారం, పన్నే కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రతి గ్రామంలో పార్టీ కమిటీ, వంద ఓటర్లకు ఒక సభ్యుడిని నియమించే ప్రక్రియను ఏడాది క్రితమే పూర్తిచేశారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కూడా విజయవంతంగా నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చైతన్య స్ఫూర్తిని నింపాయి. ఈ నియోజకవర్గంలో పదేండ్లుగా బీఆర్ఎస్ హవాయే కొనసాగుతున్నది. బాజిరెడ్డి తనయుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తండ్రికి బాసటగా నిలుస్తూ నియోజకవర్గంలోని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారం రోజుల క్రితం బాజిరెడ్డి జగన్, నుడా చైర్మన్ ఈగ సంజీవ్రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, రూరల్, మోపాల్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచారం సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలను వివరించారు. గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడానికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలపై ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకతను కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులకు వివరించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు మరో 35 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటికీ కూడా కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అత్యధిక బలగం ఉన్న బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన బాజిరెడ్డికి మద్దతుగా అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసారి కూడా అదే తరహాలో కులసంఘాల నాయకులు ముందుకొచ్చి తాము నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్లకు ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఏడు మండలాల్లో ఉన్న నియోజకవర్గ స్థాయి కులసంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత నియోజకవర్గంలోని రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనం గురువారం మోపాల్ మండలంలోని బోర్గాం(పీ) గ్రామంలోని మొటాడి రెడ్డి కల్యాణ మండపంలో నిర్వహించేందుకు ఆ కుల సంఘం నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. డిచ్పల్లి మండలంలోని నడ్పల్లి గ్రామశివారులో ఉన్న జీ కన్వెన్షన్ హాల్లో 27 న గొల్ల కుర్మ, యాదవ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం, 28న దళిత కులస్తుల ఆత్మీయ సమ్మేళనం, 29న డిచ్పల్లిలోని ఎస్ఎల్జీ గార్డెన్లో పద్మశాలీ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం, 30న బోర్గాం(పి) శివారులోని భారతి గార్డెన్లో గంగపుత్ర కుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. మరికొన్ని కులసంఘాలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నాయి. ఇప్పటికే ప్రకటించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆయా కులసంఘాల నాయకులు సమష్టి కృషి చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి 3వేల నుంచి 4 వేల మంది తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.