మాక్లూర్, ఏప్రిల్ 10: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలనే సర్కారు సంకల్పానికి దాతల చేయూత తోడైతే ఫలితం అద్భుతంగా ఉంటుంది. సర్కారు బడులు సైతం కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్ది, అందులో చదివే విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే మనఊరు-మనబడి కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. సకల వసతులు కల్పిస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఈ పాఠశాల నిర్మాణ పనులకు విద్యాశాఖ ద్వారా రూ.4కోట్ల70లక్షలను మంజూరు చేయించారు.
ప్రభుత్వ నిధులకు తోడుగా మాక్లూర్ గ్రామానికి చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్ గుప్తాలు వారి తండ్రి బిగాల కృష్ణమూర్తి, తాత బిగాల గంగారాం జ్ఞాపకార్థం రూ.కోటి విరాళంగా అందజేశారు. దీంతో నూతనంగా నిర్మిస్తున్న ఈ ఉన్నత పాఠశాలకు బిగాల కృష్ణమూర్తి, ప్రాథమిక పాఠశాలకు బిగాల గంగారాం (దాతల) పేర్లను పెట్టారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మాక్లూర్లో నిర్మిస్తున్న పాఠశాలలో డిజిటల్ తరగతులు, మినరల్ వాటర్ సౌకర్యం, కంప్యూటర్ విద్య, ఆధునిక లైబ్రరీ ఏర్పాటుతో కార్పొరేట్ సొబగులు అద్దుకోనున్నది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాలు ప్రత్యేక శ్రద్ధతో నిరంతరం పాఠశాల పనులను పర్యవేక్షిస్తున్నారు. నాణ్యతగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
పేద ప్రజలకు ఎంతో మేలు..
మాక్లూర్లో పాఠశాల నిర్మాణంతో చుట్టు పక్కల గ్రా మాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పాఠశాల నిర్మాణానికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రభు త్వం ద్వారా రూ.4.70కోట్లు మంజూరు చేయించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, సోదరుడు బిగాల మహేశ్ గుప్తా వారి తండ్రి, తాతల జ్ఞాపకార్థం రూ.కోటి విరాళం అందజేయడం సంతోషంగా ఉన్నది. మాక్లూర్ గ్రామస్తుల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– దర్గల సాయిలు, మాక్లూర్