Kotagiri | కోటగిరి, మార్చి 26 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించారు. కోటగిరి మండలం ఎతొండ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. పలువురు విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠాలపై అరా తీశారు. విద్యార్థులతో స్వయంగా చదివించారు. విద్యార్థుల ప్రతిభపై సబ్ కలెక్టర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆరో తరగతి విద్యార్థుల ఎండ్ లైన్ పరీక్ష పత్రాలను సమీక్షించారు. విద్యార్థుల చదవడం ,రాయడం నైపుణ్యాలను కూడా అంచనా వేసి ప్రత్యేక కృషి ద్వారా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విద్యార్థుల గైర్హాజరు పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీరియడ్ ప్లాన్ ప్రకారం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయ సహాయక బృందం విద్యార్థులపై అదనపు శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ గంగాధర్, మండల విద్యాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఉన్నారు.