బీర్కూర్, మార్చి 2: బీర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా గురువారం పూజ, యజ్ఞం, అర్చన, అభిషేకాధి కార్యక్రమాలు నిర్వహించగా.. సభాపతి పోచారం దంపతులు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శాంతిపాఠం, ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన, నిత్యహవనము, పూర్ణాహుతి, బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
మాఢవీధుల్లో సూర్యప్రభ వాహనంపై స్వామివారిని ఊరేగించగా..సభాపతి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం, రైతునగర్ బృందంచే కోలాటం శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన, నిత్య హవనము, పూర్ణాహుతి, బలిహరణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగాయి. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పోచారం సోదరుడు శంభురెడ్డి దంపతులు, మద్దినేని నాగేశ్వర్రావు, నర్సరాజు, అప్పారావు, రాంబాబు, కిరణ్, ఆలయ మేనేజర్ విఠల్, అర్చకులు నందు, అభిషేక్ పాల్గొన్నారు.