బాన్సువాడ టౌన్, మే 29: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలోని తన నివాసానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. తమ సమస్యలను స్పీకర్కు విన్నవించగా.. వాటికి ఆయన పరిష్కారం చూపారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని కోరుతూ సభాపతికి విన్నవించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా గృహలక్ష్మి పథకాన్ని వచ్చే నెల నుంచి అమలుచేయనున్నదని తెలిపారు.
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 3 లక్షలు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఈ పథకంలో కాంట్రాక్టర్లు, అగ్రిమెంట్ ఏమీ ఉండవన్నారు. స్థానిక ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రజలు ప్రజాప్రతినిధి లేదా అధికారులకు ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ ఇచ్చినట్లు, తీసుకున్నట్లు తన దృష్టికి వస్తే సంక్షేమ పథకాన్ని రద్దుచేయడమే కాకుండా వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడడం స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మ ధ్య వారధి లాంటి వారని అన్నారు.
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు స్పీకర్ పోచారం అందజేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉపయోగపడుతోందన్నారు. సమైక్య పాలనలో సీఎంఆర్ఎఫ్ కో సం రోజుల తరబడి హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో గ్రామంలో సర్పంచ్ లేదా వార్డు కౌన్సిలర్ ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటే బాధితుల ఇంటివద్దకే వచ్చి చెక్కును అందజేస్తున్నారని వివరించారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, సీనియర్ నాయకులు దోడ్ల వెంకట్రాం రెడ్డి, నార్ల ఉదయ్, కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ బేగం, కౌన్సిలర్లు బాడీ శ్రీనివాస్, రఫీక్, లింగమేశ్వర్, దొన్కంటి వెంకటేశ్, నాయకుడు నార్ల ఉదయ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఉన్నారు.
స్పీకర్కు జీవితాంతం రుణపడి ఉంటా.. డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు గూండ్ల మైశవ్వ
బాన్సువాడ టౌన్, మే 29:డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరుచేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి జీవితాంతం తమ కుటుంబం రుణపడి ఉంటుందని లబ్ధిదారు గూండ్ల మైశవ్వ అన్నారు. బాన్సువాడకు చెందిన గూండ్ల మైశవ్వకు సొంతిల్లు లేదని స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ ద్వారా తెలుసుకున్న స్పీకర్ పోచారం.. పట్టణంలోని సంగమేశ్వరకాలనీలో ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతోపాటు డబుల్ బెడ్రూం ఇంటి కోసం నిధులు మంజూరుచేశారు. సోమవారం పట్టణంలోని బీరప్ప ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపనోత్సవానికి వచ్చిన సభాపతిని చూసి గూండ్ల మైశవ్వ దగ్గరకు వెళ్లి నమస్కరించింది. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నామని, ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటున్నామని స్పీకర్కు చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది.