బాన్సువాడ టౌన్, డిసెంబర్ 11: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిరోజూ ఓ నేతన్న ఆత్మహత్య వార్త కనిపించేదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నేడు నేతన్నల ఆత్మహత్యలు లేని తెలంగాణను చూస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఒకటోవార్డులో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న పద్మశాలీ కల్యాణ మండపం నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన ఆత్మీయసమ్మేళనంలో సభాపతి మాట్లాడారు. తనకు పద్మశాలీలతో 45 ఏండ్ల అనుబంధం ఉన్నదని గుర్తుచేశారు. తన రాజకీయ జీవితంలో వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలీల ప్రధాన వృత్తి చేనేత అని, నేతన్నల ఆత్మహత్యలను చూస్తే తాను చలించిపోయేవాడినని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక నేతన్నలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరలను నేతన్నలతోనే తయారు చేయించి చేతినిండా పనికల్పిస్తున్నదని తెలిపారు. సీఎం సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో పదివేల ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా 31 ఎకరాల్లో ఓ కాలనీ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. స్పీకర్ను పద్మశాలీ సంఘం తరపున ఘనంగా సన్మానించారు.
జుక్కల్ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. పద్మశాలీలు ఐక్యతకు మారుపేరని అన్నారు. స్పీకర్ పెద్ద మనసుతో కల్యాణ మండపం నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సురేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పద్మశాలీ సంఘం జిల్లా, మండలస్థాయి నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.