సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసుకోగలుగుతున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో దళితవాడ, నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రూ.4.60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు.
-బాన్సువాడ టౌన్/ నస్రుల్లాబాద్,జూలై 30
బాన్సువాడ టౌన్/నస్రుల్లాబాద్, జూలై 30: సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు తెస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తన ధ్యేయమని, తన నియోజకవర్గంలో గూడులేని కుటుంబం ఉండొద్దనే లక్ష్యంతోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు. బాన్సువాడ పట్టణంతోపాటు నస్రుల్లాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. బాన్సువాడలోని దళితవాడలో రూ. 18 లక్షల నిధులతో నిర్మించిన పార్కు, రూ. 36.30 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ట్యాంక్, రూ. 15 లక్షలతో నిర్మించిన కల్యాణమండం కిచెన్షెడ్ను ప్రారంభించారు. రూ. 20 లక్షలతో నిర్మించనున్న దండోరా ఫంక్షన్హాల్తోపాటు గృహలక్ష్మి పథకం కింద 40 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. పట్టణంలో సొంతిల్లు లేనివారు ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేస్తే గృహలక్ష్మి పథకం కింద మంజూరు చేస్తానని తెలిపారు. పూర్తి ఉచితంగా ఇండ్లు నిర్మించి అందజేస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు.
దేశంలోనే 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించుకున్న ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని తెలిపారు. బాన్సువాడ జీపీగా ఉన్నప్పుడు దళితవాడకు 40 ఇండ్లు కట్టించామని, మున్సిపాలిటీగా ఏర్పడ్డాక 76 ఇండ్లు నిర్మించామని తెలిపారు. సొంత స్థలంలో కట్టుకునేవారికి 47 ఇండ్లు మంజూరు చేశామని, స్థలం లేనివారికి తాడ్కోల్ శివారులో ఏర్పాటుచేసిన కేసీఆర్ నగర్, పీఎస్ఆర్ కాలనీలో 27 ఇండ్లు కేటాయించామని వివరించారు. దీంతోపాటు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద సీసీ, ప్రహరీ కోసం రూ. 13 లక్షలు, డ్వాక్రా భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు, మున్సిపల్ కార్మికుల భవనం కోసం రూ. 10 లక్షలు, కాలనీ అభివృద్ధి కోసం రూ. 18 కోట్లు కేటాయించానని తెలిపారు. దళిత కాలనీకి ఇంత పెద్ద మొత్తంలో నిధలు కేటాయించిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని ప్రకటించేందుకు గర్వపడుతున్నానని తెలిపారు.
దళితులతో అనుబంధం..
బాన్సువాడలోని దళితులతో తనకు 1978 నుంచి అనుబంధం ఉన్నదని గుర్తుచేశారు. అన్ని కాలనీలను దాటుకొని చిట్టచివరన ఉన్న దళితవాడకు వచ్చి బసవేశ్వర మందిరం వద్ద స్నేహితులను కలిసేవాడినని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. రాజకీయ రంగప్రవేశం చేసినప్పటినుంచి తన వెన్నంటే ఉన్న దళితులకు రుణపడి ఉన్నానని, అందుకే దళితవాడను ఒక మాడల్ కాలనీలా తీర్చిదిద్దానన్నారు. అనంతరం స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ప్రత్యేక రాష్ట్రంలోనే ఆలయాలకు పూర్వ వైభవం
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే ఇక్కడి ప్రాంత ఆలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలకేంద్రంలో రూ.25 లక్షల నిధులతో చేపట్టనున్న రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణం, రూ.1.35 కోట్లతో నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి కొచ్చెరు మైసమ్మ ఆలయం మీదుగా లింగపల్లి తండా వరకు బీటీ రోడ్డు, మైసమ్మ ఆలయ ప్రాంగణంలో రూ. 1.60కోట్లతో కాటేజీలు, రూ.40 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి రూ. 150 కోట్లు కేటాయించామని తెలిపారు. కొచ్చెరు మైసమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెంది భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నదని తెలిపారు.
సీఎం కేసీఆర్ సహకారంతోనే ప్రజల ఆకాంక్ష, అవసరాల మేరకు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మైసమ్మ ఆలయం వద్ద నాలుగు కాటేజీలు, రోడ్డుతోపాటు మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఆర్డీవో భుజంగరావు, ఎంపీపీ విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, మైలారం సర్పంచ్ యశోద, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, ఆలయ కమిటీ ప్రతినిధులు సాయాగౌడ్, మహేందర్, మైలారం ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి, నాయకులు ప్రతాప్ సింగ్, శ్యామల, మల్లేశ్, లక్ష్మీనారాయణ గౌడ్, చంద్రాగౌడ్, మోహన్, రాము, నారాయణ, హన్మాండ్లు, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.