కోటగిరి, జూలై 5: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి కోటగిరి మండలంలోని కొల్లూర్, దోమలెడ్గి, యాద్గార్పూర్ గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పేదలపై వైద్య ఖర్చుల భారం పడకూడదనే ఉద్దేశంతో బస్తీ, పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
గర్భిణులకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంతోపాటు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నదని, బాలింతలకు కేసీఆర్ కిట్ అందజేస్తున్నట్లు గుర్తుచేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో తెలంగాణలో అమలుచేసే పథకం ఒక్కటీ లేదన్నారు. రైతులకు పంట పెట్టుబడి, రైతుబీమా పథకాలను ఇతర ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడంలేదని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ త్వరలోనే సింగిల్ బెడ్రూం స్కీం కింద ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థికసాయం అందిస్తామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాసరావు, జడ్పీటీసీ శంకర్పటేల్, ఎంపీటీసీ అనంత విఠల్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, సర్పంచులు అనంత జయరాణీ దిగంబర్పటేల్, విజయా చిన్న సాయన్న, కాలే నాగరాణీ సంపత్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొల్లూర్ కిశోర్బాబు, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హమీద్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో మనోహర్రెడ్డి, హౌసింగ్ డీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రూ.12.50 కోట్లతో ఎత్తొండ ఎక్స్రోడ్ నుంచి సుంకిని వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కొల్లూర్లో శంకుస్థాపన చేశారు. రూ.2.55కోట్ల నిధులతో దోమలెడ్గి వాగు వద్ద వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ. 30లక్షల నిధులతో హనుమాన్ ఆలయ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. రూ. 21లక్షలతో నిర్మించిన కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. సర్పంచ్ జయరాణిని సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. రూ. 16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు.
ఎస్సీ కాలనీలో మాల, మాదిగ కమ్యూనిటీ భవనాలు, పాఠశాల, విఠలేశ్వర మందిరానికి ప్రహరీలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. యాద్గార్పూర్లో హనుమాన్ మందిరం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్ తండ్రి ఇటీవల మృతి చెందగా, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.