కోటగిరి, నవంబర్ 18 : రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చేది సీఎం కేసీఆర్ అని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం సుద్దులం, సుద్దులంతండా, హరిలాల్తండా, రాంపూర్ తండా, రాంపూర్, కోటగిరి, ఎత్తొండ, యాద్గార్పూర్, దోమలెడ్గి, వల్లభాపూర్లో పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రచారం చేశారు. పోచారానికి మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్ల కోసం గ్రామాల్లోకి బ్రోకర్స్ వస్తున్నారని కానీ నేను పక్కా లోకల్ అని, అన్ని వర్గాల సంక్షే మం కోసం నిత్యం శ్రమించే నాయకుడినని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో తనకు బాగా తెలుసని, వాళ్ల సంక్షేమమే తన ధ్యేయమన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను పోచారం శ్రీనివాసరెడ్డి అభ్యర్థించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మిమోసపొవద్దని సూచించారు. గృహలక్ష్మీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తానన్నారు. కేసీఆర్ బీమా అమలు చేస్తామన్నారు. 18 ఏండ్లు నిండి, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెలా రూ.3వేల పింఛన్ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా కోటగిరి మాలివాడ, పోచారం కాలనీ, కోటగిరిలో పలువురు యూత్ సభ్యులు, కుల సంఘాల సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి పూర్తి మద్దతూ తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మాన పత్రాలను అందజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కోటగిరిలో మాల్యాద్రిరెడ్డి ముఖ్యఅనుచరుడు వర్ని మాజీ జడ్పీటీసీ సభ్యుడు రంజ్యానాయక్, కోటగిరి సీనియర్ యువ నాయకుడు సీహెచ్ గురునాథ్, శ్రీనివాస్యాదవ్ శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పోచారం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, బద్యానాయక్, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ శంకర్పటేల్, స్థానిక సర్పంచులు సాయిలు, కిషన్, సుశీల నగేశ్, లక్ష్మణ్, సాయిబాబా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, కిశోర్బాబు, కూచిసిద్దూ, గంగాధర్, మండల నాయకులు ఎజాజ్ఖాన్, వల్లెపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ హెచ్.స్వరూప, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రుద్రూర్, నవంబర్18: రుద్రూర్ మండలం కొందాపూర్లో నిర్వహించిన ప్రచారంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసి ఆదరించే విషయంలో కొందాపూర్ గ్రామస్తులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ఇప్పటి వరకు కొందాపూర్లో జరిగిన అభివృద్ధిలో ప్రజల తరఫున తమవంతు సహకారం అందజేసిన రాజయ్య, బాలకృష్ణ, బీర్కూర్ సాయిలును అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, సర్పంచ్ భాగ్య, ఉపసర్పంచ్ గన్శ్యామ్, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, పట్టెపు రాములు తదితరులు ఉన్నారు.
రుద్రూర్, నవంబర్ 18 : బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమని, భారీ మెజార్టీయే లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం సులేమాన్నగర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ను మించిన నాయకుడు లేడని అన్నారు. అనంతరం అమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా భాస్కర్రెడ్డికి ఏకగ్రీవ తీర్మాన కాపీని అందజేశారు. ఈ నెల 20న బాన్సువాడలో ముస్లింలతో నిర్వహించే సభకు మహమూద్ అలీ వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ సుజాత, వైస్ ఎంపీపీ సాయిలు, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, సర్పంచ్ ఖాదర్, పార్టీ గ్రామాధ్యక్షుడు హబీబ్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్/బాన్సువాడ టౌన్/వర్ని/నస్రుల్లాబాద్/ కోటగిరి/రుద్రూర్/మోస్రా(చందూర్), నవంబర్ 18 : బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ పట్టణంతోపాటు బాన్సువాడ రూరల్ మండలం, నస్రుల్లాబాద్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా తదితర మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. బాన్సువాడలోని 1వ వార్డులో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సతీమణి సోనీరెడ్డి, స్పీకర్ పోచారం కూతురు అరుణారెడ్డి, అల్లుడు పరిగె వెంకట్రామ్రెడ్డి, 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గంగాధర్ ఆధ్వర్యంలో బాన్సువాడలోని ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల కోసం ఆహర్నిశలు సేవలు అందించే పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.