వర్ని, అక్టోబర్ 28: కమ్మ కులస్తులు తన కుటుంబ సభ్యులేనని, వారి ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు తలెత్తినా అండగా ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్నారు. కమ్మవారితో తనకు విడదీయలేని అనుబంధం ఉన్నదని, 30 ఏండ్లుగా తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. బాన్సువాడలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. స్పీకర్కు మద్దతుగా శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల కమ్మ కులస్తులు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్ని మండల కేంద్రంలో నిర్వహించిన కమ్మ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ మాట్లాడారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బాన్సువాడ నియోజకవర్గంలో కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగిందన్నారు. వ్యవసాయం చేసుకుంటున్న తనను శ్రీనివాసరావు ప్రోత్సహించి రాజకీయాల వైపు తీసుకొచ్చారని, ఆ తర్వాత రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు.
ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరువు..
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, కుల సంఘాలు తనకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటిస్తున్నాయని పోచారం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని సర్వేలు చెబుతున్నాయన్నారు. బాన్సువాడలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. భారీ కార్ల ర్యాలీతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేశానంటే దానికి కారణం సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేయడమేనని వివరించారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఉంటే, రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందన్నారు.
చంద్రబాబు అరెస్టు దుర్మార్గం..
సీనియర్ నాయకుడు చంద్రబాబు అరెస్టును స్పీకర్ పోచారం ఖండించారు. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని రాజకీయ కక్షలతో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ ఫీజు కోసం రూ.25 వేలను వర్ని మండలం నెహ్రూనగర్కు చెందిన అప్పసాని శ్రీనివాసరావు అందజేశారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, స్పీకర్ సతీమణి పుష్ప, కోడలు సోనీరెడ్డి, వర్ని, కోటగిరి ఎంపీపీలు మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, సునీతా శ్రీనివాస్రావు, బీర్కూర్ జడ్పీటీసీ సతీశ్, వర్ని ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, నాయకులు రవికిరణ్, రెడ్డి వీర్రాజు, మేక వీర్రాజు, కిశోర్బాబు తదితరులు పాల్గొన్నారు.