బాన్సువాడ, నవంబర్ 27 : బాన్సువాడ పట్టణం 2014కు ముందు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుందీ.. ఒక్కసారి ఆలోచన చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి మాత్రం ఓ దుర్మార్గుడని, ఆయనది గుండాయిజం, రౌడీయిజం అని అన్నారు. ఎవరైనా కార్యకర్తలు పనులు చేయించాలని అడిగితే పోలీస్స్టేషన్లో వేసి కొట్టించేవాడని తెలిపారు. నా జీవితంలో నేను ఎక్కడా పొరపాటు, ఎవరికీ అన్యాయం చేయలేదని అన్నారు. పది రూపాయల మట్టి కుండ కొనేటప్పుడు పదిసార్లు పరీక్ష చేసి కొంటామని అన్నారు. మనకు ఐదు సంవత్సరాలు సేవ చేసే నాయకుడిని ఆలోచన చేసి సరిగ్గా ఓటు వేసి గెలిపించాలని సూచించారు. బాన్సువాడ అభివృద్ధి చెందింది, పోచారం శ్రీనివాసరెడ్డి నిజంగానే అభివృద్ధి చేశాడని మీ మనసుకు అనిపిస్తే ఓటు వేయండి అని అన్నారు. బాన్సువాడ మండలంలోని మొగులాన్పల్లి గ్రామంలో, తాడ్కోల్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీ, దాల్మల్ కుచ్చ, బాన్సువాడలోని డబుల్ బెడ్రూం కాలనీలో స్పీకర్ ప్రచారం నిర్వహించారు.
బాన్సువాడలోని 6, 7, 8, 9, 10, 11, 12 వార్డుల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రచారం నిర్వహించారు. మహిళలు, యువకులు స్పీకర్ను ఘనంగా స్వాగతించారు. తనతో ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గంగాధర్, షేక్ జుబేర్, కౌన్సిలర్లు రమాదేవి, సరిత, రవీందర్రె డ్డి, సుగుణ, కిరణ్, వెంకటేశ్, లింగమేశ్వర్, బాడిశ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, పట్టణ మహిళా అధ్యక్షురాలు అనిత, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సిం హులు, వైస్ చైర్మన్ రాజు, మైనార్టీ నాయకులు మీరా, మహ్మద్ ఎజాస్, వాహబ్, అలిమొద్దీన్ బాబా, ప్రతిమారెడ్డి తదితరులు ఉన్నారు.
చందూర్, నవంబర్ 27 : రైతు బాగుంటేనే దేశం బాగుంటుంద ని, నియోజకవర్గంలో రైతులే ఎక్కువగా ఉన్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చందూర్లో సభాపతి పోచారం సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా పోచారం మాట్లాడుతూ.. అంబానీ, ఆదానీలకు కోట్ల రూపాయల సంపద ఉన్నా రైతు పండిస్తేనే అన్నం తినాలని అన్నారు. డబ్బులను వండుకు తినలేరని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. అందుకే కేసీఆర్ రైతుల క్షేమం కోసం అన్నింటిని ఏర్పాటు చేశారన్నారు. కొన్ని ఏరియాల్లో నీరందక సొప్ప, మక్క పంటలు వేస్తున్నారని సిద్ధాపూర్ రిజర్వాయర్ను నిర్మిస్తున్నామన్నారు.
పనులు త్వరగా పూర్తి కావాలని అక్కడే నేనొక రూం కట్టుకుంటానని, అప్పుడే పనులు చురుగ్గా సాగుతాయన్నారు. పోచారం కమీషన్కు ఆశపడే వ్యక్తి కాదని, నేను చేసే పనులు భావితరాలకు గుర్తుండేలా ఉండాలని ప్రజలకోసం తపిస్తానని అన్నారు. డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, పోచారం రవీందర్రెడ్డి, ఎంపీపీ లావణ్య, సర్పంచులు సాయారెడ్డి, సత్యనారాయణ, దేవీసింగ్, గంగారాం, రవి, అశోక్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్ని, నవంబర్ 27 : బాన్సువాడ నియోజకవర్గంలో 75 శాతం ఓటర్లు బీఆర్ఎస్వైపే ఉన్నారని పోచారం శ్రీనివాసరెడ్డి సూచిం చారు. వర్ని, చందూర్, మోస్రా, రుద్రూరు, కోటగిరి, పొతంగల్ మండలాల్లోని ఆయా గ్రామాల బూత్ ఇన్చార్జిలకు వర్నిలోని సీసీడీలో సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాము నిర్వహించిన సర్వేలో ఓటర్లు ప్రత్యర్థులను నమ్మడంలేదని, అభి వృద్ధికే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రత్యర్థులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తారని, బూత్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే గుర్తించాలని సూచించారు. ఈవీఎం యంత్రాలపై ఓటర్లకు ముందుగానే అవగాహన కల్పించి కారు గుర్తు పక్కనే ఉన్న నీలి రంగు బటన్ను నొక్కేలా చూడాలని అన్నారు. పోలింగ్ కంపార్ట్మెంటులో వెలుతురు ఉండేలా ముందుగానే అధికారులకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, వర్ని, రుద్రూరు, చందూర్, మోస్రా, కోటగిరి మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, బూత్ కమిటీ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.
వర్ని మండలం జాకోర లిఫ్ట్ పరిధిలోని జాకోర, అంతాపూర్, పొట్టి గుట్ట తండా, మల్లారం, కూనీపూర్, జలాల్పూర్, సైద్పూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సోమవారం భారీ ఎత్తున మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మల్లారం గ్రామం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆయా గ్రామాల మీదుగా చందూర్ మండలంలో నిర్వహించే బహిరంగ సమావేశానికి తరలి వెళ్లారు.