బాన్సువాడ, జూలై 21: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని, స్వరాష్ట్రంలో రైతులకు సమృద్ధిగా ఎరువులు లభిస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. కోటితో నిర్మించిన సొసైటీ భవనాన్ని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, గతంలో బస్తా ఎరువు కావాలన్నా పైరవీలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవని తెలిపారు.
1987లో తాను డీసీసీబీ చైర్మన్గా పనిచేశానని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సహకార సంఘాలు బలోపేతమైనట్లు చెప్పారు. సింగిల్ విండో (ఏకగవాక్ష విధానం) ద్వారా రైతులకు అన్ని రకాల సేవలను ఒకే ప్రదేశంలో అందించడంతో సహకార వ్యవస్థ విజయవంతమైనట్లు తెలిపారు. ఇప్పటికీ అదే వ్యవస్థ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.స్వలాభం చూసుకోకుండా సేవాభావంతో పనిచేసే సొసైటీలో అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. ఇరవై ఏండ్లుగా బాన్సువాడ సొసైటీ అభివృద్ధి కోసం చైర్మన్ కృష్ణారెడ్డి కృషిచేస్తూ జిల్లాలో ఆదర్శంగా నిలిపారని అభినందించారు. భవిష్యత్తులో బాన్సువాడ సొసైటీని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుపాలని కోరారు.తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంతో మాట్లాడి ఎరువులను సీజన్ కన్నా ముందే రైతులకు అందుబాటులో ఉంచినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎరువుల కొరత లేదన్నారు.
ఈ ఏడాది సమయానికి నిజంసాగర్ కాలువలకు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 5 టీఎంసీలు ఉండగా.. మరో 5 టీఎంసీల నీటిని కొండ పోచమ్మ సాగర్ ద్వారా విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు నిజంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో మొదటి సారి జూన్ 21న కాలువలకు నీటిని విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తున్నాయని, నిజంసాగర్ ప్రాజెక్టులోకి వరద మొదలైందని తెలిపారు. పంటల సాగుకు నీళ్లు పుష్కలంగా సరిపోతాయని అన్నారు. కార్యక్రమంలో డీసీవో వసంత, పీఆర్ ఈఈ సమత, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ పరిగె మంజుల, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, నాయకులు పిట్ల శ్రీధర్ , సాయిరెడ్డి, డైరెక్టర్లు బర్ల సాయిలు, దోన్కంటి సాయిలు, బీరుగొండ, సంతోష్ రెడ్డి, విఠల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలి: స్పీకర్
బాన్సువాడ, జూలై 21: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. మరో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఇప్పటికే రెడ్ అలర్డ్ ప్రకటించారని తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని, ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఉండవద్దని, ఇతర ప్రదేశాల్లో తలదాచుకోవాలని అన్నారు. పాఠశాల విద్యార్థులు ఇండ్ల వద్ద ఆడుకోవడానికి, నీళ్లు ఉన్న చోటుకు వెళ్లకుండా తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.