నస్రుల్లాబాద్, మే 1: ఉద్యోగం చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి ఇంటివద్ద ఉండండి అంటూ వ్యవసాయశాఖ అధికారులపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు. సభాపతిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో సమావేశం ఏర్పాటు చేయగా.. సభాపతిని గ్రామానికి చెందిన కొందరు రైతులు కలిసి ఏఈవో భానుప్రశాంత్రెడ్డి తమ సమస్యలు పట్టించుకోవడంలేదని, విధులకు కూడా సక్రమంగా రావడంలేదని ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన సాయిలు ఎనిమిది నెలల క్రితం మరణించగా ఇప్పటి వరకు రైతుబీమా ఆన్లైన్ చేయకపోవడంతో ఏవో నరేంద్ర, ఏఈవో భానుప్రశాంత్రెడ్డిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో తిరిగి ఎప్పటికప్పుడు వరి ధాన్యం కాంటాలు పెట్టించి రైస్ మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో ఫోన్ద్వారా మాట్లాడారు. వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి రైస్మిల్లర్లతో మాట్లాడి ధాన్యం తరలించేలా చూడాలని ఆదేశించారు.
రోహిణి కార్తెలో నారుమడి వేయాలి
రైతులు రోహిణీ కార్తెలో వరి నారు మడులు వేయాలని స్పీకర్ పోచారం సూచించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మే మొదటి వారం వరకు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంటుందన్నారు. రైతులు నారుమడి ముందుగా వేసుకుంటామని కోరితే నిజాంసాగర్ నీటిని విడుదల చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నన్ని రోజులు వరి ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది ఉండదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, సర్పంచ్ పురం లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి, జిల్లా కో- ఆప్షన్ సభ్యుడు మాజీద్, విండో చైర్మన్లు మారుతి, దివిటి శ్రీనివాస్, ఏడీఏ వినయ్ కుమార్, ఏవో నరేంద్ర, నాయకులు ప్రతాప్ సింగ్,కిశోర్ యాదవ్,పురం వెంకటి, కంది మల్లేశ్, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తడిసిన ధాన్యాన్ని సోమవారం రాత్రి స్పీకర్ పోచారం పరిశీలించారు. త్వరగా కాంటాలు వేయాలని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్ ఉన్నారు.