బాన్సువాడ, జూలై 4 : ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.కోటీ 5 లక్షలతో నిర్మించిన ఏడీఏ, రైతుబంధు సమితి కార్యాలయాలు, దుకాణ సముదాయాలను అంతర్జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులుతో కలిసి స్పీకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం మొత్తం ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరుకున్నదన్నారు. గతంలో రైతులు, వ్యవసాయం గురించి సమావేశాల్లో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండేదన్నారు. కానీ నేడు రాష్ట్రంలో అమలు చేస్తు న్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు వంటి పథకాలతో ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామని అన్నారు.
వ్యవసాయంలో విత్తనాలు, ఎరువులు, నీటితో పాటు రైతు చిందించే స్వేదం కూడా అంతే ముఖ్యం అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా మారిందని, ఏటా వందల కోట విలువైన విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ప్రైవేటు మిల్లర్ల బాధలను తప్పించడానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాకు ఒక రైస్మిల్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారని తెలిపారు. దీంతో పాటు అనుబంధ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేస్తారని వివరించారు. బాన్సువాడ ప్రాంతంలో కూడా ఒక రైస్మిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మిల్లుల ద్వారా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తారని.. తద్వారా పోటీ పెరిగి మంచి ధర లభిస్తుందని వివరించారు. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో బి య్యం లేక మన రాష్ట్రం నుంచి పంపాలని ఆ రాష్ర్టాల ముఖ్యమంత్రులు అడుగుతున్నారని అన్నారు. వానకాలం పంట సాగుకోసం నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీలు ఉండగా, రైతుల అవసరాల మేరకు మరో 5 టీఎంసీలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. గతంలో నెల రోజులు తిరిగినా ఒక టీఎంసీ నీళ్లు కూడా వచ్చేవి కావన్నారు. ఇప్పుడు మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన నిర్ణయాలు అని అన్నారు.
కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో ఏదేదో మాట్లాడుతున్నారని స్పీకర్ అన్నారు. రాహుల్గాంధీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారని, మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్ఘడ్, కర్ణాటక, రాజస్తాన్ రాష్ర్టా ల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో కేవలం రూ.600 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. ముందు ఆ రాష్ర్టాల్లో ఇచ్చిన తరువాత ఇక్కడ మాట్లాడాలని హితవు పలికారు. కేవలం ఓట్లకోసమే ఈ నాటకాలు.. పేద ప్రజలను మోసం చేయడానికే ఈ హామీలు అన్నారు. ఎన్ని చెప్పినా ప్రజలు వాళ్ల మాయమాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్నది మన రాష్ట్రమే అని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంపీపీలు నీరజా వెంకట్రాం రెడ్డి, రఘు, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, గంగుల గంగారాం, ఆత్మ కమి టీ అధ్యక్షుడు మోహన్నాయక్, రైతుబంధు సమితి మండ ల అధ్యక్షుడు సంగ్రాం నాయక్, ఏఎంసీ చైర్మన్ నర్సింహులు, కోర్ల పోతురెడ్డి, పిట్ల శ్రీధర్, డీసీసీబీ డైరెక్టర్ భూషణ్ రెడ్డి, వాహబ్, ఖమ్రుద్దీన్, నర్సింహాచారి, గంగాధర్, సాయిలు, బీరుగొండ, డీఏవో, ఈఈ నర్సింహారెడ్డి, ఏడీఏ వినయ్కుమార్ రెడ్డి,ఏవో కమల,ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.