కామారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ) : అకాలవర్షాలతో రైతులు పంట నష్టాల బారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలులతో రైతులు తమ పంటలను పెద్ద సంఖ్యలో కోల్పోయారు. అకాలవర్షాలతో పంట నష్టం వాటిల్లకుండా వానకాలం, యాసంగి పంటల సాగును రైతులు నాలుగు వారాల ముందే ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయానా రైతు అయిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. తన నియోజకవర్గంలోని రైతులకు ఈ విషయమై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గస్థాయి రైతు సదస్సును ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద బాన్సువాడ నియోజకవర్గ రైతులు సాగుచేసే పంటలను అకాలవర్షాల బారి నుంచి తప్పించేందుకు స్పీకర్ భరోసానిస్తున్నారు.
నేడు రైతు సదస్సు..
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయ వెనుక భాగంలో ఉన్న ఫంక్షన్ హాల్లో నేడు (శనివారం) రైతు సదస్సును నిర్వహించనున్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రుద్రూర్ కృషి విజ్ఞాన్ కేంద్రం, ఏరువాక కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, బోధన్, బాన్సువాడ ఆర్డీవోలు, తహసీల్దార్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరుకానున్నారు.
ఈ సదస్సులో వానకాలం -2023లో వేసుకోవాల్సిన పంటలు, ముందస్తుగా వరి సాగు, వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ముందస్తు సాగుపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయాన్ని బాన్సువాడ నియోజకవర్గ రైతులు స్వాగతిస్తున్నారు. జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల రైతులకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు పుష్కలంగా లభిస్తున్నది. దీంతో ముందస్తు పంటల సాగుకు ఇక్కడ అనుకూలంగా ఉన్నది.
వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పటి నుంచే..
2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి.. అప్పటినుంచే రైతులకు అకాలవర్షాల బారిన పడకుండా పంట కాలాన్ని 4 వారాలు ముందుకు జరపాలంటూ పలుమార్లు సూచనలు చేస్తూ వచ్చారు. ఆయన సూచనలను బీర్కూర్, వర్ని, చందూర్ మండలాలకు చెందిన రైతులు అనుకరించి, పంట సాగులో లాభాలు పొందారు. ముఖ్యంగా వర్ని ప్రాంతంలో రైతులు ముందస్తుగానే పంటలను సాగు చేస్తూ, అందరి కన్నా ముందే పంట దిగుబడులను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ముందస్తు సాగుపై నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెట్టేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కసరత్తు చేస్తున్నారు. శనివారం నిర్వహించే సదస్సులో వరి సాగుపై ఓ నిర్ణయానికి వస్తారు. ముందస్తు సాగుకు నీటిపారుదల, వ్యవసాయ, మార్కెటింగ్, విద్యుత్ శాఖల అధికారులు సహకరించాల్సి ఉంటుంది. అందుకే వీరందరినీ సదస్సుకు పిలిచి సూచనలు చేయనున్నారు.
ముందస్తుకు నిజాంసాగర్ ఆయకట్టు అనుకూలం
స్వల్పకాలిక పంట అయిన వరి సాగుకు నిజాంసాగర్ ఆయకట్టు అనుకూలంగా ఉన్నది. ఈ ప్రాజెక్టులోకి సింగూరుతో పాటు తాజాగా కాళేశ్వరం ప్యాకేజీలోని కొండపోచమ్మసాగర్ నుంచి పుష్కలంగా నీరు వస్తుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా ఉండి, ఆయకట్టు కింద సాగుచేసే రెండు పంటలకూ నీరందిస్తున్నది. కల్యాణి, సింగీతం ప్రాజెక్టుల నుంచి నీరు లభిస్తున్నది. అలాగే నాగమడుగు ఎత్తిపోతల పనులు కొనసాగుతున్నాయి. సిద్ధాపూర్ వద్ద రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో నిజాంసాగర్ ఆయకట్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, కోటగిరి, వర్ని, చందూర్, ఎడపల్లి మండలాలకు చెందిన సుమారు 1.50 లక్షల ఎకరాలకు ఇప్పటికే నీరందుతున్నది. బోర్ల కింద సుమారు 80 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. భూగర్భజలాలు పుష్కలంగా ఉండడం, ఉచిత విద్యుత్ కారణంగా రైతులు సునాయసంగా పంటలను సాగు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ముందస్తు సాగు విజయవంతమైతే రైతులు అకాల వర్షాల బారిన పడి పంటలను కోల్పోయే పరిస్థితి ఉండదు.
రైతన్నలకు సూచనలిస్తాం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతులు ముందస్తు పంటలను సాగు చేసేలా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ముందుగా బాన్సువాడ నియోజకవర్గంలోని రైతులతో సదస్సు నిర్వహిస్తున్నాం. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుబంధు సమితి కార్యవర్గాల అభిప్రాయాలను సేకరించి ప్రణాళికను ఖరారు చేస్తాం. స్పీకర్ సూచనలే ఇందులో ముఖ్యం. ఆయన స్వయాన రైతు కావడంతో ఇక్కడ సాగు చేసే వంగడాలపై చర్చించి నిర్ణయం తీసుకొంటాం.
– వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి
రైతులకు ముందస్తుపై అవగాహన
జిల్లాలోని బాన్సువాడ ప్రాంతం ముందస్తు సాగుకు అనుకూలంగా ఉన్నది. నిజాంసాగర్ ఆయకట్టు కింద ఈ ప్రాంత రైతులకు పుష్కలంగా నీరు అందుతుంది. స్పీకర్ ప్రత్యేక చొరవతో ఇక్కడ ముందస్తు సాగు చేస్తే పంట దిగుబడి పెరగడంతోపాటు అకాలవర్షాలతో పంట నష్టం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ముందస్తు సాగు విజయవంతమైతే జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు వీలుంటుంది. రైతులందరూ సదస్సుకు హాజరుకావాలి.
– అంజిరెడ్డి, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు