బాన్సువాడ, నవంబర్ 17 : పట్టణంలో తాగునీరు, విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు ప్రత్యేక దృష్టిసారించాలని, నిర్లక్ష్యం వహించే సిబ్బందిని తొలగించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పట్టణంలో పరిశుద్ధమైన వాతవరణం కల్పించాలన్నారు. గురువారం ఆయన తన నివాసంలో బాన్సువాడ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సిబ్బందితో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక వసతులపై సమీక్షించారు. పట్టణంలో ప్రజలకు మున్సిపల్ ద్వారా అందుతున్న సేవలపై ఆరాతీశారు.
కొత్త గ్రామ పంచాయతీ , మున్సిపాలిటీ చట్టానికి లోబడి అధికారులు, పాలక వర్గ సభ్యులు విధులు నిర్వర్తించాలని సూచించారు, అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందేలా, కాలనీలు పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ధతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రోజూ ఉదయం వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ పర్యటించాలని సూచించారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో చెత్తను పొడిచెత్త, తడిచెత్తగా విభజించి సేకరించాలని సూచించినప్పటికీ అమలుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు, పాలకవర్గ సభ్యుల అశ్రద్ధ, నిర్లక్ష్యం, అసమర్థత వల్ల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. శుక్రవారం నుంచి అన్ని వార్డుల్లో ప్రతి వ్యక్తికి 130 లీటర్ల చొప్పున మిషన్ భగీరథ నీటిని అందించాలని సూచించారు.
అరగంట విద్యుత్ సరఫరా నిలిపివేయాలి
నల్లాలు వచ్చే సమయంలో ఉదయం 7 నుంచి 7.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. నల్లాలకు విద్యుత్ మోటర్లు పెట్టుకున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అంకిత భావంతో పనిచేసి మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు మోహన్నాయక్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ కల్యాణం రమేశ్, టీపీవో భూపతి, ఏఈ విఠోబా పాల్గొన్నారు.