బాన్సువాడ, మార్చి 9: అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు, 120 నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తే, అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని గుర్తు చేశారు. విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన క్రీడా దినోత్సవంలో స్పీకర్ పాల్గొన్నారు. రూ.75 లక్షలతో నిర్మించిన ఉర్దూ మీడియం కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సభాపతి మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నా మన బిడ్డల చదువులకు అడ్డంకి కాకూడదని సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేశారన్నారు. అందులో భాగంగానే వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు/కళాశాలల ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యవిద్యావిధానంలో సమూల మార్పులు రానున్నాయన్నారు. 33 జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని, సుమారు 800 మందికి వైద్యవిద్య చదివే అవకాశం వస్తుందన్నారు. విద్యార్థులు బాగా చదివి ఎంసెట్, నీట్లో మంచి మార్కులు సాధించి వైద్యులుగా ఎదగాలని సూచించారు. బాగా చదివితే గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా మంచి జీతాలు ఇచ్చే కంపెనీలు మస్తు ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందన్నారు. గతంలో ఐటీ అంటే బెంగళూరు పేరు ఉండేదని, ఇప్పుడు హైదరాబాద్ పేరు వినిపిస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమని పేర్కొన్నారు. విద్యాలయంలో మౌలిక వసతులు కల్పించడం తమ బాధ్యత అని, చదవడం మాత్రం విద్యార్థుల బాధ్యత అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దయతో బాన్సువాడ నియోజక వర్గంలో 300 పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించినట్లు చెప్పారు. 150 అంగన్వాడీ, రూ. 50 కోట్లతో డిగ్రీ కళాశాల, రూ. 40 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల మంజూరైందని, తరగతులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు తన కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. తల్లులను గౌరవించే కార్యక్రమాన్ని త్వరలోనే పేపర్ ద్వారా ప్రకటిస్తానని స్పీకర్ పోచారం తెలిపారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో మహిళా వారోత్సవాలు జరుపుకోబోతున్నామని చెప్పారు. మహిళా వారోత్సవాలను జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నా, ఒక బలమైన కారణం ఉందన్నారు. వైద్య సేవలు అందించడంలో బాన్సువాడ మతాశిశు దవాఖానకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు రావాలని సూచించారు.
కాంట్రాక్టర్ పై స్పీకర్ పోచారం ఆగ్రహం
రూ.75 లక్షలతో నిర్మించిన ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని సభాపతి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులకు ఫర్నిచర్ లేకపోవడంతో కాంట్రాక్టర్పై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కింద కూర్చుని చదువమంటారా? మీ బిడ్డలు అయితే ఇలాగే చేస్తారా? అని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. రెండురోజుల్లో ఫర్నిచర్ రావాలని స్పష్టం చేశారు.
అలరించిన నృత్యాలు
క్రీడా దినోత్సవంలో భాగంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్నాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ గురు వినయ్ కుమార్, మహ్మద్ ఎజాస్, కొర్లపోతురెడ్డి, మెప్మా పీడీ శ్రీధర్రెడ్డి, డ్వాక్రా సంఘాల అధికారి రవీందర్, బాబా, కౌన్సిలర్లు , కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ జయకుమారి, అధ్యాపకులు యాదాగౌడ్, శ్రీనివాస్, గంగాధర్, జలీల్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.