ప్రాజెక్టులో ఏడాదిపాటు నీరు ఉండేలా ప్రత్యేక కార్యాచరణ
‘మిషన్ కాకతీయ’తో పెరిగిన భూగర్భ జలాలు
పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
నాగిరెడ్డిపేట్, జూలై 11: పోచారం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్ ప్రతిక్షణం శ్రమిస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్రెడ్డితో కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోకపోతే వేసవికాలంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఏడాదిపాటు ప్రాజెక్టులో నీరు ఉండేలా కార్యాచరణ రూ పొందించినట్లు తెలిపారు. లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండేలా సీఎం ప్రణాళికను సిద్ధం చేశారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో లిఫ్టు ఇరిగేషన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు భా రీ రిజర్వాయర్ల ద్వారా చెరువులన్నింటినీ సస్యశ్యామలం చేయనున్నట్లు చెప్పారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రజలకు త్వరలో నీటి ఇబ్బందులు దూరం కానున్నట్లు చెప్పారు. పురాతన చెరువులను కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మతులు చేపట్టడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోచారం ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు సభాపతి తెలిపారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు వరప్రదాయినిగా మారుస్తామని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కన్నా ముందే పోచారం ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. మండలంలోని కాలువలు, చెరువుల్లో ఉన్న ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులను సభాపతి పోచారం ఆదేశించారు. కార్యక్రమంలో పోచారం గ్రామ సర్పంచ్ విజితారెడ్డి, ఎంపీటీసీ వినితారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్రెడ్డి, ఎంపీపీ రాజదాస్, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యమ్రావు, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్ధార్ సయ్యద్ అహ్మద్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధ య్య, వాసురెడ్డి, దుర్గారెడ్డి,కిరణ్, సుభాకర్రెడ్డి, బాల్రెడ్డి, కృష్ణ, ఆయాగ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్తో అధిక లాభాలు
వరికి బదులుగా ఇతర పంటలతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు.వరి పంట అవసరం కన్నా ఎక్కువగా పండడంతో రైతులు లాభాలను కోల్పోతున్నట్లు చెప్పారు. వరి పంటకు ఎక్కువగా లేదా తక్కువగా వర్షాలు కురిసినా నష్టమే జరుగుతుందన్నారు. ఆయిల్పామ్ పంట సాగుతో లాభాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 విలువ చేసే ఆయిల్పామ్ మొక్కలను కేవలం 20 రూపాయలకే ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్క సారి మొక్క నాటితే జీవితాంతం పంట వస్తుందన్నారు. రైతులు ఇతర పంటలు వేసే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మండలంలోని విత్తనోత్పత్తి క్షేత్రంలో అయిల్పాం పంటను సాగుచేయించాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్కు సూచించారు.
రైతులు నిర్భయంగా పంటలు వేసుకోవచ్చు
ఇండ్లు కూలిపోయిన వారికి వెంటనే పునరావాసం కల్పించాలి
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: స్పీకర్ పోచారం
కోటగిరి, జూలై 11: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో వానకాలం పంటల సాగుకు నీటికి ఢోకాలేదని, రైతులు నిర్భయంగా పంటలు వేసుకోవచ్చని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులను సభాపతి అప్రమత్తం చేశారు. సోమవారం కోటగిరి మార్కెట్ కమిటీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో కురిసిన వర్షాలు, వరదలు, నీటితో నిండిన చెరువులపై ఆరా తీశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. చెరువులు, చెక్డ్యాములు, వాగులు, కుంటల వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువుల నుంచి నీరు బయటికి వెళ్లడానికి అలు గు ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకున్నవారికి బిల్లులు మంజూరైనట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ శంకర్పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్దూ, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, మండల కో-ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీర్కూర్లో పంట నష్టం వివరాలపై ఆరా
నస్రుల్లాబాద్ (బీర్కూర్), జూలై 11: కోటగిరి నుంచి బాన్సువాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో బీర్కూర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులతో మాట్లాడారు. వర్షాలతో జరిగిన పంట నష్టం వివరాలను రైతులు, అధికా రులను అడిగి తెలుసుకున్నారు.