రెంజల్, డిసెంబర్4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్దె ఇండ్లలో ఎన్నో కష్టాలు అనుభవించిన పేదల సొంతింటి కల సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో సాకారమైంది. గూడు లేని నిరుపేద కుటుంబాలు ఇరుకైన అద్దె ఇండ్లలో జీవితాన్ని నెట్టుకొస్తున్న విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తూ వారి కళ్లలో ఆనందాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగా ఇండ్లు లేని పేదల కోసం మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసి పనులు పూర్తి చేయించింది. కళ్యాపూర్ గ్రామానికి రెండో విడుతలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వ మంజూరు చేసంది. ఇండ్లు నిర్మించేందుకు అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. మంజూరైన నిధులతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులను చేయించారు. పనుల్లో నాణ్యతా ప్రామాణాలు పాటించేలా బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ సంబంధిత శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. అన్ని హంగులతో ప్రభుత్వం రూప కల్పన చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయింది.
డబుల్బెడ్రూం ఇండ్లకు మిషన్ భగీరథ పథకం నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు సౌకర్యం కలిస్తున్నారు. మురికి కాలువల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
సర్పంచ్గా నాహయాంలో లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. గతంలో నిరుపేద కుటుంబాలకు సొంతింటి నిర్మాణం కలగానే మిగిలేది. కానీ సీఎం కేసీఆర్ హయాంలో పేదలకు కూడా సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు.
– కాశం నిరంజనీ సాయిలు, సర్పంచ్ కళ్యాపూర్
కళ్యాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన చిన్నచన్న పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం. నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా పారదర్శకత పాటించాం. రెవెన్యూ అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తాం.
– నాగేశ్వర్రావు, డీఈ, హౌసింగ్