మోర్తాడ్, జూన్ 5: ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు నీళ్లొదుతూ కొందరు దండుకుంటున్నారు. ట్రిప్పుపై అదనంగా వసూలు చేస్తూ ప్రజలను దోచేస్తున్నారు. పాలెంలో ఇసుక తరలింపునకు అనుమతి ఉన్నప్పటికీ, ఇసుక తరలింపు విషయంలో నిబంధనలు పాటించడం లేదు. అసలు అనుమతి ఉన్న క్వారీ నుంచి ఇసుక తరలింపు ఈ తీరుగా జరుగుతుందా? అన్న పరిస్థితి నెలకొన్నది. వేబిల్లుల ప్రకారం ఇసుక తరలింపు జరగాల్సి ఉండగా, అదికూడా సక్రమంగా జరగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తరలిపోతున్నా అధికారులు మౌనంగా ఉండడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే ఇసుక ఈ దందా చేస్తుండడంతోనే వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అనుమతి ఉన్న క్వారీ నుంచి ఇసుక తరలింపునకు నిర్దేశిత సమయం ఉంటుంది. ఆ సమయంలోపే ఇసుకను తరలించేందుకు అవకాశం ఉంటుంది. కానీ పాలెం పెద్దవాగు నుంచి ఇసుక తరలింపునకు మాత్రం సమయపాలన లేకుండా పోయింది. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల్లోపే పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు వాగులోకి వెళ్లాయి. 7 గంటలకే ఇసుక తీసుకుని బయటకు రావడం, 7.30కే పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు కమ్మర్పల్లికి చేరుకోవడం గమనార్హం. అధికారులు రాకముందే ఇసుకను తరలిస్తున్నారంటే అది సక్రమం ఎలా అవుతుందన్న ప్రశ్న తలెత్తుతున్నది.
ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏ ట్రాక్టర్లో తరలిస్తున్నారో నంబర్లతో సహా దరఖాస్తు చేసుకుంటారు. అదే నంబర్ ట్రాక్టర్ పేరు మీద వే బిల్లు జారీ అవుతుంది. అయితే ఇక్కడ మాత్రం ఆ నిబంధన వర్తించడం లేదు. ఇసుక తరలింపునకు వస్తున్న ట్రాక్టర్లలో కొన్నింటికి నంబర్లే లేవు. ట్రాక్టర్లకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో లేవో, డ్రైవర్లకు లైసెన్స్లు ఉన్నాయో లేవో తనిఖీ చేసే అధికారులే లేకుండా పోయారు. ఇక, ఒకే వేబిల్లు మీద అనేక ట్రిప్పులు ఇసుక తరలిస్తూ తమకు అనువైన చోట డంప్ చేస్తూ రాత్రుల్లో ట్రిప్పర్లలో అక్రమంగా తరలించుకుపోతున్నట్లు తెలిసింది. వేబిల్లుల ప్రకారం ఇసుక తరలించడంతో పాటు దరఖాస్తు చేసుకున్న సదరు ఇంటికి ఇసుక వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పాలెం వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఒక్కో ట్రిప్పునకు గ్రామ కమిటీ రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తుండగా, నిర్వహణ కోసమని కొందరు అదనంగా మరో రూ.700 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే, గ్రామాల్లో గ్రామకమిటీలు వసూలు చేయడం పరిపాటే కానీ, అదనంగా తీసుకుంటున్న రూ.700 ఎవరి కోసమనే ప్రశ్న వినిపిస్తున్నది. అదనపు వసూళ్లతో ప్రజలకు ఇసుక ప్రియంగా మారిందన్న అభిప్రాయాలున్నాయి. అదనపు వసూళ్ల విషయంలో కొందరు అధికారుల కోసమని బాహాటంగా మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఇక్కడ అంతా సక్రమంగానే జరుగుతుందన్నట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఒక్కరోజు ఇసుక నడిస్తే అదనంగా వసూలు చేస్తున్న మొత్తం లక్షల్లో జమ అవుతుంగా, ఇంత మొత్తం ఎవరి కోసం వసూలు చేస్తున్నారన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు.
పాలెం పెద్దవాగు నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఉన్నది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక తరలించేందుకు అనుమతి ఉన్నది. అదనపు వసూళ్ల విషయం మా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని పరిశీలిస్తాం. నిబంధనలకు అనుగుణంగా ఇసుక తరలించేలా చర్యలు తీసుకుంటాం.
– అచ్యుతరెడ్డి,ఇన్చార్జి తహసీల్దార్, మోర్తాడ్