జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్య కొంతకాలంగా వేధిస్తున్నది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా తగినంతమంది టీచర్లు లేకపోవడంతో బోధన కుంటుపడుతున్నది. ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నడిచే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అన్న చందంగా.. అక్రమ డిప్యుటేషన్లతో ఉన్న కాస్త ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడంతో తరగతులు ఎన్ని ఉన్నా బోధించే ఉపాధ్యాయులు ఒక్కరే కావడం గమనార్హం.
డిప్యుటేషన్ల పేరిట నిజాంసాగర్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఇతర మండలాల్లో విధులు నిర్వర్తిస్తుండడంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతున్నది. నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు యశ్వంత్తోపాటు ఉపాధ్యాయులు మురళీ, ఫరీదా ఉన్నారు. ప్రస్తుతం యశ్వంత్ ఒక్కరే ఐదు తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. మురళి పైచదువుల కోసం దీర్ఘకాలిక సెలవులో వెళ్లగా, ఫరిదా డిప్యుటేషన్పై అచ్చంపేట పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సింగ్రావ్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సుమారు 80మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా, వారిలో ఇద్దరు డిప్యుటేషన్పై వెళ్లారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులందరినీ ఒకే తరగతి గదిలో కూర్చుండబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. దీంతో పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. గున్కుల్ పాఠశాలలో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయురాలు నస్రుల్లాబాద్లో, అచ్చంపేటలో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయుడు కామారెడ్డిలో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల డిప్యుటేషన్లను రద్దు చేసి ఎక్కడి వారు అక్కడే విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా డిప్యుటేషన్లను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మా ఊరి పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రస్తుతం ఒక్కరే సారు ఉన్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు అందకుండా పోతున్నాయి. మా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపించడంతో కొరత ఏర్పడింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి డిప్యుటేషన్లను రద్దు చేయాలి.
మా పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా వారిలో నుంచి ఇద్దరిని అచ్చంపేట పాఠశాలకు పంపించారు. ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులమే పాఠాలు బోధిస్తున్నాం. ఇద్దరు ఉపాధ్యాయులను అచ్చంపేటకు పంపిస్తే వారిలో నుంచి ఒకరు కామారెడ్డికి డిప్యుటేషన్పై వెళ్లారు. ఉపాధ్యాయుల కొరత మాట వాస్తవమే. దీంతో ఒక్కోసారి విద్యార్థులందరికీ ఒకేచోట బోధించాల్సి వస్తుంది.