పిట్లం, మే 26: గొల్ల, కుర్మల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వారు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 20 గొర్రె పిల్లలను రెండేండ్లలో 60 గొర్రెలను చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ గొల్ల కురుమలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గొల్ల కురుమలు కులవృత్తి మరవకూడదన్న ఉద్దేశంతో రాయితీపై గొర్రెపిల్లలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓ వైపు రైతాంగానికి, మరోవైపు ఇతర కులాల వారికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, వారి కుటుంబాలకు కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రెండో విడుత కింద 27 యూనిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి సింహారావు, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు విజయ్, విండో చైర్మన్ శపథంరెడ్డి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు జొన్న శ్రీనివాస్రెడ్డి, ఆయా మండలాల పశువైద్యాధికారులు సంతోష్, భాస్కరన్, వెంకటేశ్వర్రెడ్డి, వినీత్, యూనుస్, మొయిన్ తదితరులు పాల్గొన్నారు.