కామారెడ్డి, జూన్ 14 : వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
వేసవి సెలవుల్లో అమ్మమ్మ, బంధువుల ఇండ్లకు వెళ్లిన చిన్నారులు ఇక ఆట పాటలకు గుడ్బై చెప్పి పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సోమవారం అమావాస్య కావడంతో మొదటిరోజు పాఠశాలలకు తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా లేదా? అనేది చూడాలి. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి డీఈవో మల్లికార్జున్ తెలిపారు.
బడులు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటివరకు శుభ్రం చేయకపోవడం గమనార్హం. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే దానిని తొలగించాలని కోరుతున్నారు.