బాల్కొండ, జూన్ 9 : సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కన్నా గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం ‘సంక్షేమ సంబురాలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి వేములకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బాల్కొండ నియోజకవర్గంలో అందుతున్న ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, గొర్రెల పంపిణీ తదితర పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేసి, రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ కులవృత్తుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభించిన నేపథ్యంలో అవుసుల, వడ్రంగి, చాకలి, ఆరె కటికె కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఐదుగురికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు భరోసా కల్పించేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఈ యేడాది వెయ్యి మందికి, రానున్న రోజుల్లో మిగతా కుల వృత్తుల్లో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున అందజేస్తామన్నారు.
అన్ని వర్గాల వారికి అండగా కేసీఆర్
వృద్ధులకు పెద్దకొడుకుగా, ఒంటరి మహిళలకు అన్నగా, ఆడబిడ్డ పెండ్లికి మేనమామగా, కేసీఆర్ కిట్తో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని మంత్రి వివరించారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 62 వేల మందికి రూ.910 కోట్ల పెన్షన్లు ఇచ్చామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల మందికి రూ. 58 లక్షలు మాత్రమే ఇచ్చేదని తెలిపారు. అప్పుడు కేవలం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే రూ.200ల చొప్పున ఇచ్చేవారన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళ, వితంతు, బీడీ, కల్లు గీత, చేనేత, కార్మికులు, బోదకాలు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 2వేలు, దివ్యాంగులకు రూ. 3 వేల పింఛన్ ఇస్తున్నదని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని పేర్కొన్నారు.
దేవుడి పేరుచెప్పి మభ్యపెట్టేవారిపట్ల జాగ్రత్త
కొందరు దేవుడు, దేశం పేరుమీద యువకులు, మహిళలను మభ్యపెట్టే పనులకు పూనుకున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మన సంప్రదాయంలో భాగంగా ఎప్పటి నుంచో బొట్టు పెట్టుకుంటున్నామని, దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నామని, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామని అన్నారు. ఎవరో వచ్చి ఇప్పుడే కొత్తగా చేస్తున్నట్లు చెబితే నమ్మొద్దని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. తెల్లారితే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్న పింఛన్ రూ.750, ఉత్తర ప్రదేశ్లో రూ.500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. గుజరాత్లో పెన్షన్ల కోసం నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తుంటే..సీఎం కేసీఆర్ తెలంగాణలో రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ మహిళలే తనకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని, వారి ఆశీర్వాదం అలాగే కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో డీసీవో సింహాచలం, ఓఎస్డీ విజయేందర్, ఎంపీడీవో సంతోష్కుమార్, తహసీల్దార్ వినోద్కుమార్, సర్పంచ్ సునీత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి, జడ్పీటీసీ లావణ్యా లింగాగౌడ్, ఎంపీపీ లావణ్య, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, సాగర్ యాదవ్, పోశెట్టి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.