నస్రుల్లాబాద్, జూన్ 17: గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో శనివారం ‘గిరిజనోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పీకర్ హాజరయ్యారు. గిరిజనులు ఏర్పాటు చేసిన భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం రూ.7 కోట్లతో చేపట్టనున్న గిరిజన బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొమ్మిందేడ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి ఈ ఉత్సవాలు జరుపుకొంటున్నామని తెలిపారు.
2014 నుంచి ఇప్పటివరకు గిరిజనుల కోసం రూ.53,417 కోట్లను ఖర్చుచేసినట్లు తెలిపారు. తండాలు, గిరిజన గూడేలను పంచాయతీలుగా మారుస్తామని గత ప్రభుత్వాలు, సీ ఎంలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 3146 తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చారని తెలిపారు.గిరిజన, బంజారాల దశాబ్దాల కలను సాకారం చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచామన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా 1,55, 000 మంది గిరిజన యువతులకు రూ. 1306 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. రైతు బంధు పథకం ద్వారా 8.2 లక్షల మంది గిరిజన రైతులకు రూ.8305 కోట్లను ఇచ్చిందన్నారు. 3.5 లక్షల మంది గిరిజనులకు ఆసరా పింఛన్ల కింద ఇప్పటి వరకు రూ.4500 కోట్లను అందించినట్లు తెలిపారు.
త్వరలో పోడుపట్టాల పంపిణీ
రాష్ట్రంలోని 1.50 లక్షల మంది గిరిజన రైతులకు త్వరలో పోడుభూముల పట్టాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. బాన్సువాడ నియోజక వర్గంలో 2104 మంది గిరిజన రైతులకు పోడుభూముల పట్టాలను అందిస్తామన్నారు. ఈ భూములు ఉన్న రైతులకు రైతుబంధు,రైతు బీమా వర్తిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 98 గురుకుల పాఠశాలలు మంజూరైనట్లు చెప్పారు. బాన్సువాడ నియోజక వర్గంలో 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా..ఇందులో గిరిజనులకు రెండువేల ఇండ్లను అందజేసినట్లు తెలిపారు. నియోజక వర్గంలో సేవాలాల్ మహరాజ్ ఆలయాల కోసం రూ.25కోట్లు మంజూరు చేశానని చెప్పారు.
విద్యార్థుల సంఖ్య పెరగడంతో రూ.12 కోట్లతో వసతి గృహాన్ని ఇక్కడే నిర్మిస్తున్నామన్నారు. నస్రుల్లాబాద్ గిరిజన గురుకుల పాఠశాలలో రామారావ్ మహరాజ్ విగ్రహాన్ని తన కుమారుడు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీటీసీ జన్నూబాయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్,జిల్లా కో- ఆప్షన్ సభ్యుడు మాజిద్, బంజారా నాయకుడు బద్యానాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేశ్వర్, నాయకులు ప్రతాప్ సింగ్, కంది మల్లేశ్, దివిటి శ్రీనివాస్ యాదవ్,శ్యామల, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.