పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలోనే పోడు భూములకు పట్టాలు అందించనున్నట్లు తెలిపారు. కోటగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ గురువారం ప్రారంభించారు
కోటగిరి, ఫిబ్రవరి 16: గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలోనే తండాలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. గురువారం ఆయన మండలంలోని సుద్దులం తం డాలో సీసీ రోడ్లు, జీపీ భవనం, సేవాలాల్ , జగదాంబ ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతున్నదని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధుల కింద రూ.100 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గానికి 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైతే ఇందులో 2500 ఇండ్లను గిరిజన తండాలకు కేటాయించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి మౌలిక వసతులు కల్పించారన్నారు. తండాలను జీపీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని పేర్కొన్నారు. ఇప్పటికే అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు పోడు భూముల సర్వే చేశారని, కబ్జాలో ఉన్న గిరిజన రైతులకు త్వరలో పోడు భూముల పట్టాలు ఇ చ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
గిరిజన బాలికల కోసం ప్రత్యేకంగా బాన్సువాడ మండలం హన్మాజీపేట-కోనాపూర్ మధ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసిందని తెలిపారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాకముందు కేవలం 230 గురుకుల పాఠశాలలు ఉండగా.. స్వరాష్ట్రంలో నేడు వెయ్యికిపైగా పెరిగాయన్నారు. కల్యాణలక్షి, షాదీముబారక్ పథకం కేవలం మన రాష్ట్రంలోనే ఉన్నదని తెలిపారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సింగిల్ బెడ్ రూం ఇల్లును మంజూరు చేస్తామన్నారు
డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు కోసం ఎవరైనా లంచం అడిగినట్లు తన దృష్టికి వస్తే వారిని జైలుకే పంపిస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కొందరు కాంట్రాక్టర్లు ఇంటి నిర్మాణం కోసం అదనంగా రూ.లక్ష వరకు కావాలని అడిగితే, కొందరు దీనిని సరిగా అర్థం చేసుకోకుండా డబ్బులు అడుగుతున్నారని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కాంట్రాక్టర్లు కూడా లబ్ధిరులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని సూచించారు. ఎవరూ కూడా ఇంటి మంజూరు కోసం ఒక్క నయా పైసా ఇచ్చే అవసరం లేదన్నారు. అనంతరం సభాపతిని గిరిజనులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, స్థానిక సర్పంచ్ కిషన్నాయక్, ఉప సర్పంచ్ మోతీలాల్, మాజీ సర్పంచ్ మాధవ్రావు, జడ్పీటీసీ శంకర్పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్కుమార్, సుద్దులం సర్పంచ్ గోపు సాయిలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ఎం పీటీసీలు, నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.