కోటగిరి, ఫిబ్రవరి 26: సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదింటి కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ సమీపంలోని తెలంగాణ తిరుపతి దేవస్థానం వద్ద ఉమ్మడి కోటగిరి మండలంలోని 61 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ .. ఇప్పటి వరకు చాలా మంది ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఎవరూ కూడా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలుచేయడానికి ధైర్యం చేయలేదన్నారు.కానీ సీఎం కేసీఆర్ ఒక్కరే ధైర్యం చేసి పేదింటి ఆడబిడ్డలకు మేన మామలా కల్యాణలక్ష్మి పథకం ద్వారా అండగా నిలిచారన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 లక్షల మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.10వేల కోట్ల చెక్కులను అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గం లో దాదాపు 13,500 మంది లబ్ధిదారులకు రూ. 120 కోట్లు అందించామన్నారు. గతపాలకుల హయాంలో పెట్టుబడికి అరిగోస పడిన రైతులకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం కింద రూ.65 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమచేశారని తెలిపారు. ఏ కారణంచేతనైనా రైతు మృతి చెందితే 15 రోజుల్లోపు రైతుబీమా కింద రూ.5లక్షలు బాధిత కుటుంబానికి అందించి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్పటేల్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, సర్పంచులు పత్తి లక్ష్మణ్, వర్ని శంకర్, ఎజాజ్ఖాన్, విజయ, అమీనాభిషేరు, అనిల్ కులకర్ణి, హౌగిరావుపటేల్, మైనా ర్టీ నాయకులు ఇస్మాయిల్, సలీం, జుబేర్, బాబూఖాన్, కొత్తపల్లి సుదర్శన్, అనంత దిగంబర్పటేల్, వోలే లింగప్ప, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.