బాన్సువాడ రూరల్/ బాన్సువాడ టౌన్, జూన్ 8: స్వరాష్ట్రంలోనే చెరువుల అభివృద్ధి జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 6వేల కోట్లతో 46వేల చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చూసి చూపించినట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని తాడ్కోల్ గ్రామ చెరువు కట్ట, బాన్సువాడ కల్కి చెరువు కట్టపై గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్తోపాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, నీటి పారుదశాల శాఖ అధికారులు పాల్గొన్నారు. తాడ్కోల్ గ్రామంలో స్పీకర్ పోచారం బోనమెత్తుకున్నారు. అనంతరం చెరువు కట్టపై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా చెరువుల వద్ద ఏర్పాటు చేసిన సభలో సభాపతి మాట్లాడుతూ.. చెరువు చివరి ఆయకట్టు రైతుకు సాగునీరు అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ కింద రూ. 6వేల కోట్లతో రాష్ట్రంలోని వేల చెరువులను అభివృద్ధి చేశారని తెలిపారు. చెరువుల అభివృద్ధికి దేశంలో ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు అని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో రూ.150 కోట్లతో 250 చెరువులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
నీటి సౌకర్యం ఉన్న ప్రాంతం ఎప్పుడూ సుభిక్షమే
ఎక్కడైతే నీటి సౌకర్యం ఉంటుందో ఆ ప్రాంతం ఎప్పు డూ సుభిక్షంగా ఉంటుందని స్పీకర్ అన్నారు. మంజీరా నదిలో బాన్సువాడ వద్ద రూ. 15 కోట్లతో నిర్మించిన చెక్డ్యాంతో బుడ్మి వరకు నీరు పుష్కలంగా ఉందన్నారు. రూ. 30 కోట్లతో బీర్కూర్, రూ.70 కోట్లతో కోటగిరి, రూ. 50 కోట్లతో సుంకిని వద్ద అతిపెద్ద చెక్డ్యాంలు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. సర్పంచ్ కుమ్మరి రాజమణి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజారెడ్డి, జడ్పీటీసీ పద్మ, నీటి పారుదలశాఖ ఎస్ఈ వసంత, ఈఈ సమత, డీఎస్పీ జగన్నాథరెడ్డి, తహసీల్దార్ గంగాధర్, బుడ్మి, బాన్సువాడ విండో చైర్మన్లు గుంగుల గంగారాం, ఏర్వాల కృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ భూషణ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, మహ్మద్ ఎజాస్, గోపాల్రెడ్డి, పాత బాలకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, కుమ్మరి రాజు, లక్ష్మాగౌడ్, జగన్, భీమయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.