రైతుబంధు పంపిణీకి సర్వం సిద్ధం
నేటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బుల జమ
ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం
ఏర్పాట్లు పూర్తి చేసిన వ్యవసాయశాఖ
అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
కామారెడ్డి జిల్లాలో 2.92 లక్షల మందికి పైగా లబ్ధి
రూ.260 కోట్ల 84 లక్షల 49 వేలు జమ చేయనున్న సర్కారు
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న సమయంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేటి (మంగళవారం)నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించనున్నది. ఇందుకోసం వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కామారెడ్డి జిల్లాలో 2,92,240 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 260 కోట్ల 84లక్షల 49వేల 397 జమకానున్నాయి. అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు పరుగులు తీసే బాధ తప్పనున్నదని కర్షకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
కామారెడ్డి, జూన్ 27 : వానకాలం పంటల సీజన్ ప్రా రంభం కావడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ సమయంలో అన్నదాతకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేటి (మంగళవారం)నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్తగా అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. కామారెడ్డి జిల్లాలో 2,92,240 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 260 కోట్ల 84లక్షల 49వేల 397 జమకానున్నాయి.
అన్నదాతకు వెన్నుదన్నుగా కేసీఆర్ సర్కారు..
రైతుబిడ్డ, స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్కు అన్నదాతల కష్టాలన్నీ తెలుసు. పంటల సాగులో మొదటి అ డుగు పెట్టుబడే. చేతిలో డబ్బులులేక చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అప్పులు తెచ్చి పంటలు పండించాక తమ కష్టాన్నంతా వడ్డీల రూపంలో తిరిగి చెల్లించేవారు. ఇలాంటి బాధలను దూరం చేయడంతోపా టు ఆర్థికంగా అన్నదాతకు కేసీఆర్ సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు 2018 మే 10న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారు. మొదట ఎకరానికి రూ.4వేల చొ ప్పున అందించారు. ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడి సా యాన్ని ఎకరాకు రూ.5వేలకు పెంచారు. ఏడాదికి రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10వేలు అందిస్తున్నారు.
ఏటా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య..
జిల్లాలో రైతుబంధు పథకం అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. గత యాసంగిలో 2,62,841 మంది రైతులకు రూ. 254 కోట్ల 12 లక్షల 37వేల 824 పెట్టుబడి సాయం జమ అయ్యింది. ఈ వానకాలం సీజన్లో దాదాపు 30 వేల మంది లబ్ధిదారులు పెరిగారు. తొమ్మిదో విడుతలో 2,92,240 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించనుండగా లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో రూ. 260 కోట్ల 84లక్షల 49వేల 397 జమకానున్నాయి. ఇందులో 2,68,515 మంది రైతుల ఖాతాలు అప్డేట్ చేశారు. జిల్లా పరిధిలో 39,029 దళిత రైతులకు రూ.27,02,82,250 కోట్లు, 23, 708 మంది ఎస్టీ రైతులకు గాను రూ. 21,14,88,148 కోట్లు, 2,29,503 ఇతర వర్గాల వారికి రూ. 212,66,78,999 రైతుబంధు కింద జమకానున్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది.
నేటి నుంచి పెట్టుబడి డబ్బుల జమ…
రాష్ట్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నది. ఈ వానకాలం సీజన్లో పంటల పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల ఆర్థికసాయం అందించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి దశల వారీగా రైతుబం ధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఇప్పటికే రైతుబంధు లబ్ధిదారుల జాబితాను అందించింది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ కానుంది. సీం కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రైతుబంధు సహాయం ప్రకటనపై అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.
‘గివ్ ఇట్ అప్’కు 53 దరఖాస్తులు..
బడా రైతులు రైతుబంధు సహాయాన్ని స్వచ్ఛందంగా వదులుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం ‘గివ్ ఇట్ అప్’ ఆప్షన్ను ప్రవేశపెట్టింది. పెట్టుబడి సాయం వద్దనుకునేవారు.. పూర్తి వివరాలతో వ్యవసాయ శాఖ అధికారుల వద్ద దరఖాస్తులు అందజేయాలి. జిల్లాలో 53 మంది రైతులు స్వచ్ఛందంగా రైతుబంధు డబ్బులను వదులుకుంటున్నారు. బాన్సువాడ మండలంలో 23 మంది, బీర్కూర్లో ముగ్గురు, నస్రుల్లాబాద్లో ఒకరు, మద్నూర్లో ఒకరు, నిజాంసాగర్లో 12 మంది, పిట్లంలో ఇద్దరు, బీబీపేట్లో నలుగురు , దోమకొండలో ఒకరు, కామారెడ్డిలో ఇద్దరు, గాంధారిలో ఇద్దరు, నాగిరెడ్డిపేట్లో ఒకరు, తాడ్వాయిలో ఇద్దరు గివ్ ఇట్ అప్ ఆప్షన్ను ఎంచుకున్నారు. దీంతో ప్రభుత్వానికి 3 లక్షల 32 వేల 369 రూపాయలు మిగలనున్నది.
ప్రభుత్వానికి రైతుల జాబితాను అందించాం..
పెట్టుబడి సాయాన్ని విడుతల వారీగా బ్యాంకు ఖా తాల్లో జమచేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి. రైతుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. ఈ విడుతలో కొత్తగా 30వేల మందికి రైతుబంధు పథకం వర్తించనుంది. జిల్లాలోని 2.92 లక్షల రైతులకు రూ.260కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయనుంది. మిగితా రైతుల వివరాలను సేకరించి అప్డేట్ చేస్తున్నాం.
–భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి