ఇందల్వాయి, ఏప్రిల్ 8: కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందాయని, గడప గడపకూ ప్రభుత్వ పథకాలు చేరాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కన్నబిడ్డలుగా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుకునే బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలను బిచ్చగాళ్లను చేస్తున్నదని విమర్శించారు. డిచ్పల్లి మండలంలోని అమృతా గార్డెన్లో బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. మన రాష్ర్టానికి కూలీలుగా వలస వచ్చేది బీజేపీ పాలిత ప్రాంత ప్రజలేనని అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివివంతులని, ఉద్యమ చైతన్యం కలిగినవారని పేర్కొన్నారు. బీజేపీని ఇక్కడ పాతరేస్తారని హెచ్చరించారు. తెలంగాణ బిడ్డలను కన్నతండ్రిలా చూసుకుంటున్న సీఎం కేసీఆర్ను మనమంతా కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. బీజేపీ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి.
సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెడుతూ బతికే బీజేపీ.. ఆ పార్టీ కోసం పనిచేస్తున్న యువతకు అదానీ జీతాలు ఇస్తున్నాడని అన్నారు. ఏమీ తెలియని యువత వీరి చెప్పుడు మాటలకు బలైపోతున్నారని అన్నారు. బీజేపీకి యువత ఆకర్షితులు కావొద్దని సూచించారు. వాళ్ల పిల్లలను పెద్ద చదువులు చదివించుకొని, పెద్ద కొలువులు ఇప్పించుకుంటూ యువతను రెచ్చగొట్టి రోడ్లపైకి ఉసిగొల్పుతారని అన్నారు. సీఎం కేసీఆర్ లాంటి పాలనాధ్యక్షుడి హయాంలో మనం క్షేమంగా ఉన్నామని ఇదే విషయాన్ని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకోవాలని అన్నా రు. తెలంగాణ ఫలాలను దేశమంతా అందించేందుకు ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కేసీఆర్ను దీవించడం, మద్దతుగా ఉండడం మన ధర్మమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని మోదీ అంటున్నారని.. తాము దొంగలకు సహకరించబోమని స్పష్టం చేశారు. ఈడీ, మోదీ, సీబీఐల బెదిరింపులకు సీఎం కేసీఆర్ భయపడబోరని అన్నారు. మోదీ ఏ ఎండాకాగొడుగు పడతాడని విమర్శించారు. అసలు మోదీకి తెలంగాణలో తిరిగే హక్కులేదన్నారు.
బండి సంజయ్ మాట్లాడితే సీఎం కేసీఆర్ జైలుకు పోతాడని జోకర్లా మాట్లాడి తనే జైలుకు పోయాడన్నారు. తర్వాత టికెట్ ఎంపీ అర్వింద్ అని, త్వరలో ఇతనూ జైలుపాలు కాకతప్పదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను తాను కాపాడుకుంటానని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని బాజిరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ పట్ల యువత జాగ్రత్తతో ఉండాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్లోని ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ధర్పల్లి జడ్పీడీసీ బాజిరెడ్డి జగన్ సూచించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సాయిలు, జిల్లా దళిత నాయకుడు పద్మారావు, యూత్ అధ్యక్షుడు అమీర్, డిచ్పల్లి సొసైటీ వైస్ చైర్మన్ కుమ్మరి చిన్నగంగారాం, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లా హరికిషన్, నాయకులు ఒడ్డం నర్సయ్య, కుమ్మ రి గంగాధర్, గణేశ్, జగదీశ్, తిరుపతి, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
వందేభారత్ రైలు ప్రారంభించేందుకు పీఎం రావాలా? రైల్వే మంత్రి లేడా?
ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి వందేభారత్ రైలును ప్రారంభించడం సిగ్గు చేటని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దీన్ని ప్రారంభించేందుకు పీఎం రావాలా? రైల్వే మంత్రి లేడా? రాష్ట్రంలో కిషన్రెడ్డి ఉన్నాడు కదా? అని ప్రశ్నించారు. బర్రెలు గుద్దితే తుక్కు తుక్కయ్యే ఈ రైలును ప్రారంభించేందుకు పీఎం రావడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ 756 కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తే.. తమనే ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పారని గుర్తుచేశారు. అదీ కేసీఆర్కు, ప్రధాని మోదీకి ఉన్న తేడా అని చెప్పారు.
రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్
రాష్ట్రంలో రైతుల కష్టాలు గుర్తెరిగిన మహానేత సీఎం కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. బీజేపీపై రైతులు విశ్వాసం కోల్పోయారన్నారు. కేంద్రం తెలంగాణకు ఒక్క యూనివర్సిటీ కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ నాలుగేండ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారన్నారు. దేశంలోనే బీఆర్ఎస్కు మించిన బలమైన ప్రాంతీయ పార్టీ మరొకటి లేదన్నారు. మన రాష్ట్రంలో 350 పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం…
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని పదవిలో ఉండి తనను చంపడానికి సుపారీ ఇచ్చారంటూ సుపారి అనే చీప్ భాషను వాడిన ఘనత మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ చూపిన ఆశయాలకు అనుగుణంగా అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో పరిపాలన సాగిస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజల కష్టాలు…
బీజేపీ పాలించే రాష్ర్టాల్లో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ అన్నారు. ఆ రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు లేవన్నారు. ఆసరా పింఛన్లు కూడా అంతంత మాత్రంగానే ఇస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి కావాల్సిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్లో చేరిన యానంపల్లి ఎంపీటీసీ
డిచ్పల్లి మండలంలోని యానంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ అప్పాల మంజులా గణేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆమెకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై బీఆర్ఎస్లో చేరినట్లు ఎంపీటీసీ తెలిపారు. వీరితో పాటు గ్రామానికి చెందిన అంకం నరహరి పార్టీలో చేరినట్లు మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.