కోటగిరి/వర్ని, ఏప్రిల్ 12: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కోటగిరి మండలం టాక్లీ, సోంపూర్తోపాటు వర్ని మండలంలోని జలాల్పూర్, సైద్పూర్, చందూర్ మండలం మేడిపల్లి, లక్ష్మీసాగర్ తండా గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోచారం మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు.
రైతుల బాధ చూస్తుంటే ఒక రైతుగా తాను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయాధికారులు వెంటనే సర్వే చేపట్టి పంట నష్టంపై నివేదికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. పంట చేతికొచ్చాక రైతులు పూర్తిగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోచారం వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ శంకర్పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, చాకూరే గంగాధర్, నాగరాజుగౌడ్, శివరాజ్పటేల్, షాజీ, మల్లేశ్, దిగంబర్పటేల్, సంజీవ్పటేల్, రాంబాబు, గోపు సాయిలు, పావుడే రాజేందర్, రైతుబంధు సమితి వర్ని మండల కన్వీనర్ సింగంపల్లి గంగారాం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.